గోల్కొండ చివరి బోనం సమర్పణ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే ఆషాఢ బోనాల సంబురాలు ఆదివారం ముగిశాయి. ఆషాఢమాసం ప్రారంభం నుంచి శివసత్తుల పూనకాలు, బోనాల సమర్పణ, తొట్టెలు, ఫలహార బండ్ల ఊరేగింపు, పోతరాజుల విన్యాసాలు, డప్పుల మోతతో హైదరాబాద్ నగరంలో నెలరోజులపాటు ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం గోల్కొండలో చివరి బోనం సమర్పణ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. కరోనా నేపథ్యంలో అన్ని నిబంధనలు పాటించేలా ఆలయ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించారు.