కోల్కతా : బెంగాల్లో నాలుగో విడత నామినేషన్ల ఘట్టం పూర్తయింది. నామినేషన్ల పరిశీలన అనంతరం 377 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి 44 మంది, బీఎస్పీ నుంచి 13 మంది, బీజేపీ నుంచి 44 మంది, సీపీఐ నుంచి 22, కాంగ్రెస్ నుంచి 9, ఎన్పీపీ నుంచి ఇద్దరు, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఆరుగురు, ఆర్ఎస్పీ నుంచి ఇద్దరు, 80 ఇతర పార్టీల నుంచి, మరో 155 నామపత్రాలు స్వతంత్ర అభ్యర్థుల నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. నాలుగో దశలో ఏప్రిల్ 10న 44 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఐదో దశ ఎన్నికల కోసం ఇప్పటి వరకు 52 నామినేషన్లు దాఖలవగా.. ఈ నెల 30వ గడువు ఉంది. ఐదో దశలో 45 సీట్లుకు ఏప్రిల్ 17న పోలింగ్ జరుగనుంది. ఇప్పటి వరకు దాఖలైన నామినేషన్లలో నాలుగో విడత ఎన్నికల కోసం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి దశ ఎన్నికల్లో 191, రెండో దశలో 171, మూడో దశలో 205 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ప్రస్తుతం మొదటి దశ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. శనివారం ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ కొనసాగుతోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వీల్చైర్లో ప్రచారం నిర్వహిస్తూ వస్తుండగా.. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు ప్రచారం నిర్వహించారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. పార్టీకి చెందిన ముఖ్యనేతలెవరూ ప్రచారానికి హాజరుకాలేదు. అయితే కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే ముఖ్యనేతలను ప్రచారంలోకి దించడం లేదని, బెంగాల్లో గట్టిగా పోరాడితే.. బీజేపీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో స్టార్ క్యాంపెయినర్లు, ముఖ్య నేతలను ప్రచారానికి దూరంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.