నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 21 : జిల్లావ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతున్నది. ఆర్మూర్ ఏరియా దవాఖాన, పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో, మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు నాగరాజు, భాస్కర్రావు, ఆయేషా ఫిర్దోస్ తెలిపారు. ఆర్మూర్లోని ఏరియా దవాఖానలో 30 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చిందని తెలిపారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో 27 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి, మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 20 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని హెల్త్ సూపర్వైజర్లు అర్గుల్ సుభాష్, అనురాధ, చంద్రశేఖర్ తెలిపారు. రెంజల్ పీహెచ్సీ, కందకుర్తి గ్రామ శివారులోని అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద శుక్రవారం 45 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చిందని మండల వైద్యాధికారిణి క్రిస్టీనా తెలిపారు.
బోధన్ పట్టణంలోని వివిధ ప్రభుత్వ దవాఖానల్లో కరోనా పరీక్షలు నిర్వహించగా గతంలో కన్నా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గిందని వైద్యసిబ్బంది తెలిపారు. బోధన్ ప్రభుత్వ దవాఖానలో 39 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి, రాకాసీపేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో 21 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 మందికి పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్ సోకిన వారికి మెడికల్ కిట్లు అందజేసి హోం ఐసొలేషన్లో ఉండాలని సూచించామని వైద్యాధికారులు, సిబ్బంది తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 మందికి పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోనే కేసుల సంఖ్య పెరుగుతున్నది.
భీమ్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 53 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్ వచ్చినట్ల్లు ప్రభుత్వ దవాఖాన వైద్యుడు అజయ్పవార్ తెలిపారు. మోర్తాడ్ సీహెచ్సీలో 31 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ రవికుమార్ తెలిపారు. నందిపేట్ మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 40 మందికి టెస్టులు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి అజయ్కుమార్ తెలిపారు. మోపాల్ మండల కేంద్రంలోని పీహెచ్సీలో 27 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ నవీన్ తెలిపారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 23 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి రవీందర్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని సర్పంచులు పిచికారీ చేయించారు.
ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 30 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు మండల ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రఘువీర్ తెలిపారు. దుబ్బాకలో నలుగురికి, హోన్నాజీపేట్లో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ దవాఖానలో 31మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి వెంకన్న తెలిపారు. కోటగిరి మండలంలోని పొతంగల్ దవాఖానలో 20 మందికి కరోనా టెస్టులు చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ సమత తెలిపారు.బోధన్ మండలంలోని సాలూరా పీహెచ్సీ పరిధిలో ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ రేఖ తెలిపారు. శుక్రవారం 55 మందికి పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.