హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక కోర్సులను అందించే ఆర్ట్స్, సైన్స్ కాలేజీలు రాబోయే రోజుల్లో కనుమరుగుకానున్నాయి. ఇంజినీరింగ్ కాలేజీ.. ఆర్ట్స్ కాలేజీ.. మెడికల్ కాలేజీ.. ఒకేషనల్ కాలేజీ.. ఇలా కోర్సులవారీగా ఉన్న కళాశాలల స్వరూపం పూర్తిగా మారనున్నది. ఇంజినీరింగ్ కాలేజీలు ఆర్ట్స్ కోర్సులను, మెడికల్ కాలేజీలో ఇంజినీరింగ్ కోర్సులను చదువుకొనే అవకాశం రాబోతున్నది. ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నదే మల్టీ డిసిప్లినరీ అండ్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్. నూతన ఎడ్యుకేషన్ పాలసీ -2020లో భాగంగా దీనిని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ విధానాన్ని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో అమలుచేయాలని ఇటీవలే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. ఈ మేరకు యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ డీపీ సింగ్ అన్ని యూనివర్సిటీ వీసీలకు లేఖలు రాశారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, భాషలు, సైన్స్, సోషల్ సైన్సెస్, వృత్తివిద్య, సాంకేతిక, ఒకేషనల్ (మల్టీ డిసిప్లినరీ, హోలిస్టిక్ కోర్సులు) కోర్సులన్నింటిని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలుచేసేందుకు ఉన్నత విద్యామండలి అధికారులు చర్యలు చేపట్టారు. అవకాశమున్న కాలేజీల్లో దశలవారీగా కోర్సులు, విభాగాలను ప్రారంభించాలనుకుంటున్నారు.
విభాగాలవారీగా పరిమిత కోర్సులను నిర్వహించే కాలేజీలను స్టాండలోన్ కాలేజీలంటారు. అంటే ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇంజినీరింగ్ కోర్సులు, ఆర్ట్స్ కాలేజీల్లో ఆర్ట్స్ కోర్సులను నిర్వహించడమన్నమాట. తాజాగా మల్టీడిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెట్టడంతో స్టాండలోన్ కాలేజీలకు ఇక కాలం చెల్లినట్లే. ఆయా కాలేజీలు వర్తమాన అవసరాలకు తగినట్లుగా అన్ని రకాల కోర్సులను నిర్వహించాల్సి ఉంటుంది. ఇకనుంచి ప్రత్యేకంగా ఇంజినీరింగ్, మెడికల్, ఆర్ట్స్ పేరుతో కాలేజీలు కనిపించవు. మల్టీ డిసిప్లినరీ కోర్సులు ప్రవేశపెట్టిన తర్వాత చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో భాగంగా ఒక విద్యార్థి తాను ఒక కోర్సులో చేరి, మరో కోర్సు సబ్జెక్ట్ను అభ్యసించవచ్చు. ఇలా విద్యార్థులకు అన్ని రంగాల్లో తర్పీదునిచ్చి, సమగ్రవికాసానికి బాటలు వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుత విద్యావిధానంలో విద్యార్థులు కొన్ని రంగాల్లోనే తర్పీదు పొందుతున్నారు. సమాజం, ఇతర రంగాల గురించిన కనీస అవగాహన ఉండటంలేదు. దీనికి పరిష్కారంగా, విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రవేశం కల్పించాలన్నదే మల్టీ డిసిప్టినరీ కోర్సుల ముఖ్య ఉద్దేశం. గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో మెడికల్, అగ్రికల్చర్, వెటర్నీరీ కాలేజీలుండేవి. కాలక్రమేణా ప్రత్యేకంగా కాలేజీలు ఏర్పాటయ్యాయి. మల్టీడిసిప్లినరీ కోర్సుల ద్వారా ఒకే కాలేజీ, వర్సిటీలో విద్యార్థులు తమకు కావాల్సిన అన్ని కోర్సులను నేర్చుకోవచ్చు. ఇది దశలవారీగా చేపట్టాల్సి ఉంటుంది. విద్యార్థుల సమగ్రవికాసం, పరిపక్వత, విశాలమైక దృక్పథం అలవర్చడానికి ఈ విధానం దోహదం చేస్తుంది.
–ప్రొఫెసర్ గుజ్జ గోపాల్రెడ్డి, యూజీసీ సభ్యుడు