హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): వ్యవసాయరంగంలో సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పక్కనపెట్టి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను అమలుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా సాగుతోపాటు, మార్కెటింగ్లో సమస్యలను పరిష్కరించాలని భావిస్తున్నది. ఈ మేరకు ఏఐ అమలుకు చర్యలు తీసుకోలని అన్నిరాష్ర్టాల వ్యవసాయశాఖ అధికారులకు సూచించింది. వ్యవసాయంలో కృత్రిమ మేధను ఉపయోగిస్తే రైతులకు భారీ ఊరట లభించడం ఖాయం. సాగులో సమస్యలకు చెక్పెట్టడంతోపాటు.. భవిష్యత్ మార్కెటింగ్ వ్యూహాన్ని కూడా రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు… చీడపీడలు వ్యాపించిన పంటను ఫొటో తీసి సంబంధిత అధికారులకు పంపిస్తే.. వారు కృత్రిమ మేధ ద్వారా అది ఏ తెగులో గుర్తించడంతోపాటు దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. రైతులు పండించే పంటకు ఏడాది ముందునుంచే భవిష్యత్ మార్కెటింగ్ అవసరాలను అంచనా వేయనున్నది.
ముందే మొదలుపెట్టిన తెలంగాణ
వ్యవసాయరంగంలో తన సత్తా ఏంటో చూపించిన తెలంగాణ.. దేశానికే అదర్శంగా నిలిచింది. ఇప్పుడు కేంద్రం కన్నా ముందే వ్యవసాయరంగంలో కృత్రిమ మేధ అమలుకు నిర్ణయించింది. ఇప్పటికే జయశంకర్ వర్సిటీ.. పత్తి పంట సాగులో కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగిస్తుంది. తొలిదశలో ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.