హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): మన వద్ద బఠానీ దిగుబడి ఆశించినస్థాయిలో ఎందుకుండదో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ గుర్తించింది. దేశంలోని నేలల రకాలు, బఠానీ మొక్కల్లో సహజీవనం సాగించే సూక్ష్మజీవుల కూర్పు సరిగా లేకపోవడం వల్లే దిగుబడి తగ్గుతున్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. విదేశాల్లోని ఉష్ణమండల పొడిభూముల్లో బఠానీ మొక్కలు విస్తృతంగా పెరుగుతాయి. ఇతర దేశాలతో పోల్చితే మన వద్ద దిగుబడి తక్కువగా ఉండటానికి గల కారణాలను విశ్లేషించడానికి మన దేశ బయోటెక్నాలజీ విభాగం, బ్రిటన్కు చెందిన బీబీఎస్ఆర్సీ మూడేండ్ల ప్రాజెక్టును చేపట్టాయి. భారత బృందానికి హెచ్సీయూ ప్లాంట్ సైన్సెస్ విభాగం ప్రొఫెసర్ అప్పారావు నేతృత్వం వహించారు. ప్రొఫెసర్లు దంతేశ్వరి, అనిర్బన్ బసు, పీవీఎస్ఆర్ఎన్ శర్మ సభ్యులుగా ఉన్నారు.
కందులు, పెసలు, బఠానీ తదితర పప్పుధాన్యాల జాతి మొక్కలు గాలిలో ఉన్న నత్రజనిని నేరుగా పీల్చుకోలేవు. కాబట్టి ఇవి నత్రజని కోసం బ్యాక్టీరియాలపై ఆధారపడుతాయి. ముఖ్యంగా ‘రైజోబియం బ్యాక్టీరియా’ అనే సూక్ష్మజీవి ఆ మొక్కల వేర్లపై బుడిపెలను ఏర్పాటుచేస్తాయి. ఈ బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందిస్తుంది. ప్రతిగా మొక్కలు ఆ బ్యాక్టీరియాకు అవసరమైన కార్బన్, శక్తిని అందజేస్తాయి. హెచ్సీయూ బృందం మన నేలల్లోని మరో సహజీవన బ్యాక్టీరియా ‘బ్రాడి రైజోబి యం’ జీవన చర్యలను, ఆర్హార్ (బఠానీ జాతి) మొక్కల్లోని ‘రైజోబియం బ్యాక్టీరియా’ జీవన చర్యలను పోల్చుతూ పరిశోధించింది. భారత్లో బఠానీ దిగుబడి తక్కువగా రావడానికి ఇక్కడి నేలల స్వభావంతోపాటు మొక్కలు, బ్యాక్టీరియాల కూర్పు సరిగా లేకపోవడమే కారణమని గుర్తించారు. తమ పరిశోధనల ద్వారా ఏ నేలలు బఠానీకి అనుకూలమో తెలుసుకోవచ్చని ప్రొఫెసర్ అప్పారావు పేర్కొన్నారు. వీరి అధ్యయన ఫలితం అంతర్జాతీయ జర్నల్ ‘హై-ఇంపాక్ట్’లో ప్రచురితం అయ్యింది.