భీంపూర్, మే 1 : మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పాండ్రకవడ తాలూక ముకుడ్బన్ రిజర్వ్ ఫారెస్టు వాగు ఒడ్డున గర్భంతో ఉన్న పెద్దపులిని హతమార్చిన నిందితులను అరెస్టు చేసినట్టు యావత్మాల్ ఎస్పీ దిలీప్పాటిల్ భుజబల్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 25న గర్భంతో ఉన్న పెద్దపులిని అగంతకులు చంపిన కేసులో ఎనిమిది ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టాం. గత శుక్రవారం పా టన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంధర్వాని గ్రామంలో అనుమానస్పదంగా సంచరిస్తున్న ఆత్రం అశోక్, ఆత్రం రాములును అదుపులోకి తీసుకొని విచారించగా.. వారే పెద్ద పులిని చంపినట్టు ఒప్పుకొన్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నాడు. వీరి నుంచి తొమ్మిది పులి గోళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు.