న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్పైనా బాగానే పడింది. త్వరలో 4,000 మంది ఉద్యోగులను ఉద్వాసన పలికేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. సీనియర్ ఉద్యోగులకు ముందస్తు రిటైర్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీనివల్ల 598 మిలియన్ల డాలర్ల మేరకు వోక్స్ వ్యాగన్ ఆదా చేయగలుగుతుందని అంచనా.
వోక్స్ వ్యాగన్లో పని చేస్తున్న వారిలో 1964లో జన్మించిన వారికి పాక్షికంగా రిటైర్మెంట్ అమలు చేసేందుకు వర్క్ కౌన్సిల్తో తమ ప్రణాళికకు సంస్థ యాజమాన్యం ఆమోదం పొందిందని తెలుస్తున్నది. మిగతా ఉద్యోగుల్లో పాత వారిని ముందస్తుగా ఇంటికి పంపేయాలని నిర్ణయించుకున్నట్లు వినికిడి. మరో వైపు ఈ ఏడాది చివరి వరకు నూతన నియామకాలపై నిషేధం విధించింది వోక్స్ వ్యాగన్.
ఇక రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్కు బదులు పరిహారం చెల్లించడానికి 500 మిలియన్ల యూరోల నిధిని వోక్స్ వ్యాగన్ పక్కనబెట్టిందని వోక్స్ వ్యాగన్ వర్గాలు తెలిపాయి. తద్వారా దీర్ఘ కాలంలో బిలియన్ల డాలర్లు ఆదా చేయాలని సంస్థ సంకల్పించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగాల్లో మాత్రమే నూతన నియామకాలకు అనుమతినిస్తున్నట్లు తెలుస్తున్నది. వచ్చే రెండేండ్లలో ఓవర్హెడ్ ఖర్చులు ఐదు శాతం, ప్రొక్యూర్మెంట్ ఖర్చు ఏడు శాతానికి పైగా తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు గత జనవరిలోనే వోక్స్ వ్యాగన్ ప్రకటించింది.