నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 10 : మహాశివరాత్రి వేడుకలకు రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. గురువారం తెల్లవారుజాము నుంచే ఆలయా ల్లో ప్రత్యేక పూజలు ప్రారంభంకానుండగా.. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాల వద్ద షామియానాలు, మంచి నీరు, తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్ల వసతి కల్పించారు. కొవిడ్ నిబంధనలకు లోబడి భక్తులను అనుమతించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని కీసరగుట్ట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని నవబ్రహ్మ ఆలయం, నల్గొండ జిల్లా పానగల్ ఛాయాసోమేశ్వరాలయం, హన్మకొండ వేయిస్తంభాల గుడి, రామప్ప తదితర ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా జరుగనున్నా యి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు, ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశాయి. వేములవాడలో జాతర ఏర్పాట్లపై సమీక్షించిన దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి.. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేములవాడలో భక్తుల ఆహ్లాదం కోసం హెలీకాప్టర్ ద్వారా జాయ్రైడ్ ఏర్పాటుచేసినట్లు దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ తెలిపారు. వేములవాడ పరిసరాల నుంచి గుడి వద్దకు చేర్చేందుకు ఒక్కొక్కరికి రూ.2,500 ఛార్జి నిర్ణయించారు.
మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ గురువారం ఉదయం 8.30 గంటలకు పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. వీరివెంట రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ రానున్నారు. అనంతరం స్వామివారికి విశేషపూజలు నిర్వహిస్తారు. ఉదయం 7.30 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ అధికారులు పట్టువస్ర్తాలు సమర్పిస్తారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవకాలంలో స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు.