హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలోనూ రాష్ట్రంలో ఆరోగ్యలక్ష్మి పథకం నిరాఘాటంగా కొనసాగుతున్నది. పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద పౌష్టికాహారం లబ్ధిదారుల ఇంటికే ప్రభుత్వం చేరుస్తున్నది. రాష్ట్రంలోని 149 అంగన్వాడీ ప్రాజెక్టుల కింద ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని దాదాపు 21 లక్షల మందికి పౌష్టికాహారాన్ని (టేక్హోం రేషన్) ఇంటింటికీ అందిస్తున్నది. ఏడు నెలల నుంచి మూడేండ్ల వరకు, మూడేండ్ల నుంచి ఆరేండ్ల వరకు ఉన్న పిల్లలకు బాలామృతం (రెండు ఎంపిక చేసిన జిల్లాలకు బాలామృతం ప్లస్) అందిస్తున్నారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ విజయవంతంగా టేక్హోం రేషన్ను అందిస్తున్నదని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం కితాబిచ్చింది. దేశంలో అనేక రాష్ర్టాల కంటే తెలంగాణలో పిల్లలు, బాలింతలు, గర్భిణుల పౌష్టికాహార పంపిణీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు ఆ బృందం ప్రశంసించింది.
పౌష్టికాహారలోపం వల్ల రక్తహీనత, ఎదుగుదల లోపం, ఎత్తుకు తగ్గ బరువు, బరువుకు తగ్గ ఎత్తు వంటి తీవ్ర సమస్యలతో సతమతం అవుతున్న గర్భిణులు, బాలింతలు, 0-6 ఏండ్ల వయస్సున్న పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం 2015, జనవరి 1న ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి లబ్ధిదారుల్లో గణనీయమైన మార్పులు రావడంతో, ఈ మార్పులు మరింతగా ఉండాలని ప్రభుత్వం భావించింది. స్త్రీ, శిశు సంక్షేమ ఎప్పటికప్పుడు పౌష్టికాహార పంపిణీలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తూ పోషకాహార విలువలను పెంచుతున్నది. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) సహకారంతో ముందుకు సాగుతున్నది. 0-6 ఏండ్ల పిల్లలకు దేశవ్యాప్తంగా అందించే పౌష్టికాహారానికి అదనపు పోషకాలు జోడించి (బాలామృతం, బాలామృతం ప్లస్) పంపిణీ చేస్తున్నది. కొవిడ్ రాకముందు ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో ఎన్ఐఎన్ రూపొందించిన పోషకాహారాన్ని సంబంధిత అంగన్వాడీ కేంద్రాల్లో ఉడికించి (పాలు వేడి చేసి, గుడ్డు ఉడకపెట్టి.. అన్నం.. పప్పులు ఉడకబెట్టి) ఇచ్చేవారు. కరోనా నేపథ్యంలో సంవత్సరకాలంగా రాష్ట్ర ప్రభుత్వం టేక్హోం రేషన్ విధానాన్ని అనుసరిస్తున్నది.
7 నెలల నుంచి మూడేండ్ల వాళ్లు 10,01,620
3 నుంచి ఆరేండ్ల వరకున్న పిల్లలు 6,29,980
గర్భిణులు.. బాలింతలు 4,39,826
మొత్తం 20,71,426