హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): ఉప్పల్కు చెందిన నరేశ్కు కరోనా సోకింది. వ్యాధి ముదరడంతో ఆక్సిజన్ బెడ్ కావాల్సి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఉప్పల్తోపాటు ఎల్బీనగర్, సికింద్రాబాద్, మలక్పేట.. ఇలా అనేక ప్రాంతాల్లో ఆక్సిజన్ బెడ్ కోసం ప్రయత్నించారు. తమ పలుకుబడిని ఉపయోగిస్తే.. ఒక రోజు తర్వాత ఔటర్కు సమీపంలోని ఓ చిన్న దవాఖానలో ఆక్సిజన్ బెడ్ దొరికింది. హైదరాబాద్లో ఉన్న నరేశ్ పరిస్థితే ఇలా ఉంటే.. ఇతర రాష్టాల నుంచి అంబులెన్సుల్లో వచ్చే రోగుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్లాలో, ఎటు వెళ్లాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక దవాఖానల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నవారు ఎందరో. ఈ క్రమంలో ఎంతో విలువైన సమయం వృథా అయి ప్రాణాలు పోయిన ఉదంతాలెన్నో.
అందుకే.. ముందస్తుగా బెడ్ బుక్ చేసుకొని వస్తే కాలం, డబ్బు వృథా కాకుండా, ప్రాణాలు పోకుండా ఆపవచ్చని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిపై కొందరు నానాయాగీ చేస్తున్నారు. అయినా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే కరోనా రోగులను నియంత్రించడం కొత్తేమీ కాదు. గతేడాది కరోనా మొదటి వేవ్ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినా దాదాపు అన్ని రాష్ర్టాల్లో కేసుల సంఖ్య పెరిగింది. ఆ సమయంలో కర్ణాటక ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకున్నది. కేరళ నుంచి కర్ణాటకలోని మంగళూరుకు కరోనా రోగులను రానిచ్చేది లేదంటూ సరిహద్దులు మూసేసింది. గతేడాది మార్చి చివరి వారం నుంచి మంగళూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగడం ఎక్కువైంది. దీంతో అక్కడి దవాఖానలన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. దీనిపై కర్ణాటక సర్కార్ ఆరా తీయగా.. కేరళలోని కసరగాడ్ జిల్లా నుంచి కరోనా రోగులు చికిత్స కోసం మంగళూరుకు వస్తున్నట్టు తేలింది. దీంతో మంగళూరు కసరగాడ్ జాతీయ రహదారిపై రాకపోకల్ని నిషేధించింది. కర్ణాటక నిర్ణయంపై కేరళ ప్రభుత్వం తమ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. దీంతో మంగళూరుకు కేరళ రోగులకు అనుమతించాలంటూ కేరళ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
సుప్రీంకోర్టులో కుదిరిన ఒప్పందం
దీనిపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేరళ నుంచి రోగుల రాకతో తమ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నదని కర్ణాటక వాదించింది. ఈ సంకట పరిస్థితిని గ్రహించిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోవాల్సిందిగా సూచించింది. రెండు రాష్ర్టాలు రాజీ చేసుకోవాలని కోరింది. ఆ తర్వాత ఇరు రాష్ర్టాల సీఎంలు, ఉన్నతాధికారులు చర్చలు జరిపినా కర్ణాటక వెనక్కి తగ్గలేదు. కరోనా రోగులను ఎట్టిపరిస్థితుల్లోనూ తమ రాష్ర్టానికి అనుమతించేది లేదని భీష్మించుకున్నది. నాన్-కొవిడ్ (కరోనాయేతర) చికిత్సకు మాత్రం తమ రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతిచ్చింది. రాష్ట్రంలోకి వచ్చే రోగులు సరిహద్దు వద్ద తమకు కరోనా లేదని నిరూపించే ధ్రువపత్రాలు సమర్పించడంతోపాటు, ఏ చికిత్స కోసం వెళ్తున్నారు? ఏ దవాఖానకు వెళ్తున్నారు? వంటి వివరాలను సమర్పించి, రిపోర్టులను చూపించి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా సంబంధిత దవాఖానలో ముందే బెడ్ బుక్ చేసుకొని వెళ్లాలని పేర్కొన్నది. దీనికి కేరళ సైతం అంగీకరించింది. దీంతో సుప్రీంకోర్టు ఈ వివాదం పరిష్కారమైనట్టుగా ప్రకటించింది. ఇదేకాదు ఆక్జిన్ విషయంలోనూ ఇలాంటి ఆంక్షలే ఉన్నాయి.
ఆక్సిజన్పై ఆంక్షలు
గతేడాది సెప్టెంబర్లో కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు అనూహ్యంగా పెరగడంతో మెడికల్ ఆక్సిజన్కు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీంతో పలు రాష్ర్టాలు, కేంద్రపాలితాలు తమ ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే మెడికల్ ఆక్సిజన్ను సరిహద్దు దాటనీయకుండా అడ్డుకున్నాయి. అంతేకాదు.. తమ రాష్ట్రంలో ఉత్పత్తయిన ఆక్సిజన్ను తమ రాష్ట్రంలోని దవాఖానలకే సరఫరా చేయాలని తయారీదారులపై ఒత్తిడి పెంచాయి. ఇందుకోసం పలు చట్టాలను ప్రయోగించాయి. దీంతో సెప్టెంబర్ 11న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. మెడికల్ ఆక్సిజన్ రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని అన్ని రాష్ర్టాలను కోరింది. తాజాగా కర్ణాటక సైతం ఇలాంటి నిబంధనే విధించింది. కసరగాడ్ జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకు కర్ణాటక నుంచి ఆక్సిజన్ సరఫరా అయ్యేది. కర్ణాటకలో కేసులు పెరుగడంతో తాము ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయలేమని కర్ణాటక స్పష్టం చేసింది.
తల్లడిల్లుతున్న ఢిల్లీ
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ధాటికి ఢిల్లీ తల్లడిల్లుతున్నది. ఆ నగరానిది కూడా అచ్చం హైదరాబాద్ లాంటి పరిస్థితే. ఓవైపు స్థానికంగా వేల కేసులు నమోదవుతుండగా.. మరోవైపు పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ర్టాల నుంచి చికిత్స కోసం రోజూ వందల సంఖ్యలో రోగులు ఢిల్లీకి వెళ్లారు. దీంతో దవాఖానలన్నీ నిండిపోయాయి. ఆక్సిజన్ కొరత పతాక స్థాయికి చేరింది. ఏప్రిల్ రెండో వారం నాటికి పరిస్థితి ఏ దశకు చేరిందంటే.. ఢిల్లీకి చెందిన కరోనా బాధితులు సమీప రాష్ర్టాల్లోని చండీగఢ్, జైపూర్, లక్నో, మోర్దాబాద్ (యూపీ) తదితర నగరాలకు వెళ్లాల్సి వచ్చింది. ‘మాకు రోజూ 150 వరకు కాల్స్ వస్తున్నాయి. ఇందులో సుమారు 50 మంది వరకు పక్క రాష్ర్టానికి తీసుకువెళ్లాలని కోరుతున్నారు. రోజుకు కనీసం 20-30 మందిని సమీప నగరాలకు చేర్చాం’ అని ప్రేమ్చంద్ అనే ఓ అంబులెన్స్ సర్వీస్ యజమాని ఓ జాతీయ చానల్కు వివరించారు. దీన్ని బట్టే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సుప్రీంకోర్టు తీర్పుపైనా తప్పుడు భాష్యాలు
కొవిడ్ రోగులు దేశంలో ఎక్కడైనా చికిత్స చేయించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పును కొందరు తప్పుగా కోట్ చేస్తున్నారు. ఢిల్లీలో ఇతర రాష్ర్టాలవారికి చికిత్స అందించే విషయంలో ఈ సమస్య తలెత్తింది. తమ ఆధార్ కార్డులు వేరే రాష్ర్టాల చిరునామాలతో ఉన్నందున తమకు చికిత్స అందించడం లేదన్న బాధితుల ఆవేదనపై స్పందించిన సుప్రీంకోర్టు.. వారు వేరే రాష్ర్టాలవారైనా ఉంటున్నది ఢిల్లీలోనే కాబట్టి.. చికిత్స ఇక్కడ అందించాల్సిందేనని స్పష్టంచేసింది. తెలంగాణలో ఉంటున్న ఇతర రాష్ర్టాలవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్స అందుతూనే ఉన్నది. కానీ.. తెలంగాణలో నివాసం ఉండని వారు, వేరే రాష్ర్టాలకు చెందినవారు చికిత్స కోసం వస్తున్నారు. ఇదే సమస్యగా మారింది. ఈ వాస్తవాన్ని పక్కన పెట్టేసి సుప్రీంకోర్టు తీర్పులను కోట్ చేయడం తగదని పలువురు అంటున్నారు. ఏ ప్రభుత్వానికైనా ఆ రాష్ట్రంలో నివసించే రోగులను కాపాడుకోవడం ముఖ్యం దాన్ని అర్థం చేసుకోకుండా నానా యాగీ చేయడం విషం చిమ్మడమే తప్ప మరొకటి కాదు.
వైద్యవ్యవస్థపై ఒత్తిడి తగదు
ఒక ప్రాంతంలో దవాఖానలు, నిపుణులైన వైద్యసిబ్బంది, ఔషధాలు సరిపడా లేనప్పుడు లేదా ఏదైనా వ్యాధికి వేరే ప్రాంతంలోని దవాఖానలో మాత్రమే చికిత్స లభించినప్పుడు అంబులెన్స్లను ఆపే అధికారం ఏ రాష్ర్టానికీ ఉండదు. కొవిడ్ చికిత్సకు సంబంధించి నిపుణులైన సిబ్బందికన్నా.. పడకలు, వెంటిలేటర్లు, మెడికల్ ఆక్సిజన్, రెమ్డెసివిర్ లాంటి ఔషధాలు కూడా ముఖ్యమే. ఈ సౌకర్యాలు అక్కడ లేవు కాబట్టే ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు ఎక్కువ మంది రోగులు వస్తున్నారు. ఆక్సిజన్, ప్రాణాధార ఔషధాలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తున్నది. జనాభా లేదా రోగుల సంఖ్య ఆధారంగా కాకుం డా ఇష్టారీతిన కోటా నిర్ణయిస్తున్నది. దీంతో తెలంగాణకు అన్ని రకాల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతున్నది. కేంద్రం ఇస్తు న్న కోటా రాష్ట్ర ప్రజల అవసరాలకే సరిపోయే పరిస్థితి లేదు. ఇలాంటి దశలో ఇతర రాష్ర్టాల నుంచి అధిక సంఖ్యలో రోగులు తరలివస్తుండటంతో తెలంగాణ వైద్యవ్యవస్థపై విపరీతమైన ఒత్తి డి పెరుగుతున్నది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన దవాఖానల్లో బెడ్లు పూర్తిగా నిండిపోయాయి. ఇతర రాష్ర్టాలవారు వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి, బెడ్ల కోసం దవాఖానల చుట్టూ తిరుగుతున్నారు. ప్రయాణానికి, ఎదురుచూపులకు కలిపి ఒకటి రెండు రోజులు వృథా అవుతున్నది. దీంతో విలువైన ప్రాణాలు పోతున్నాయి.
చట్టపరంగా చూస్తే.. వేరే రాష్ర్టానికి చెందిన రోగి చనిపోయినప్పుడు ఆ శవాన్ని కుటుంబసభ్యులు రోడ్డుపక్కన పడేసి వెళ్తే పరిస్థితి ఏంటి? శవాలను రోడ్లమీద పడేస్తున్నారంటూ ప్రభుత్వంపై నింద వేస్తారు. అది హత్యో, ప్రమాదమో తెలియదు. పోలీసులు విచారణ జరపాలి. ఆ మృతదేహానికి పోస్ట్మార్టం చేయాలి. ఈ క్రమంలో పలువురికి కరోనా సోకే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు తిరుగు ప్రయాణంలో వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగితే.. ఆ మరణాన్ని యాక్సిడెంట్ ఖాతాలో వేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇలాంటి పలు ఘటనలు నా దృష్టికొచ్చాయి.
తిరుపతికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ ద్వారా హైదరాబాద్లో బెడ్ బుక్ చేసుకొని ప్రయాణం ప్రారంభించారని అనుకుం దాం. వారు చేరడానికి 12-13 గంటలు పడుతుంది. ఆలోగా ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగి దవాఖానకు వస్తే ఏం చేయాలి? డబ్బు కట్టినవారి కోసం బెడ్ను ఆపాలా? లేదంటే కండ్లముందున్న వ్యక్తి ప్రాణాన్ని కాపాడాలా? ఇది మానవత్వానికి పరీక్షగా మారుతుంది.
రాష్ర్టాలు లాక్డౌన్ విధించినప్పుడే విపత్తు నిర్వహణ చట్టా న్ని ప్రయోగిస్తాయి. దీంతో ఇతర చట్టాల ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో వీరి వాదన ‘యుద్ధంలో మానవ హక్కులను అడిగినట్టు’ ఉంటుంది. బాధితులను పూర్తిగా అడ్డుకోవాలని ఎవరూ చెప్పరు. తెలంగాణ ప్రభు త్వం కూడా తన ఆదేశాల్లో ఎక్కడా అడ్డుకోమని చెప్పలేదు. కేవలం క్రమబద్ధీకరిస్తామని మాత్రమే చెప్పింది. లేదంటే వైద్యవ్యవస్థపై ఒత్తిడి పెరిగి పెను పరిణామాలకు దారితీస్తుంది. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించుకొని పరిష్కారం వైపు అడుగులు వేస్తే బాగుంటుంది.