సూర్యాపేట టౌన్, మే 13: ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలకు సరిపడా మందులను అందుబాటులో ఉంచామని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి వెల్లడించారు. రెమ్డెసివిర్తోసహా కరోనాకు సంబంధించిన మందులకు ఎలాంటి కొరతలేదని స్పష్టంచేశారు. ప్రజలనుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలుచేస్తున్న ప్రైవేటు దవాఖానలపై కేసులునమోదు చేస్తున్నట్టు తెలిపారు. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుగా విస్తృత చర్యలు చేపడుతూ సంబంధిత శాఖలతోపాటు ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారని పేర్కొన్నారు. సూర్యాపేట ప్రభుత్వ దవాఖానను గురువారం ఆయన సందర్శించారు. రోగులకు అందుతున్న సేవల గురించి వారి బంధువులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొవిడ్ వచ్చిన వారికి వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని మంత్రి చెప్పారు. సమావేశంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, డీఎంహెచ్వో కోటాచలం, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ దండ మురళీధర్రెడ్డి ఉన్నారు.