మహబూబాబాద్ : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచనలేకుండా పనిచేస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన మంత్రి మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్, కోవిడ్ వార్డును సందర్శించారు. రోగులను పరామర్శించారు. వారికి మనో ధైర్యం కల్పించారు. హాస్పిటల్లో వసతులు కల్పిస్తున్న తీరును, వైద్యులు అందిస్తున్న చికిత్స గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా బారిన పడకుండా సరైన నియంత్రణ చర్యలు పాటించేందుకు, జిల్లా స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేశామని తెలిపారు. గ్రామాల్లో 750 టీమ్ లు పెట్టి పర్యవేక్షణ చేయిస్తున్నామన్నారు.
ఇంటింటికి ఈ టీమ్ లు వెళ్లి లక్షణాలు ఉన్న వారిని గుర్తించిన వెంటనే వారికి కావాల్సిన మందులు, మనో ధైర్యాన్ని అందిస్తాయన్నారు. హాస్పిటల్ కు వచ్చిన కరోనా రోగులకు సరైన సమయంలో సరైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు హాస్పిటల్లో ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు.
ఈ కొవిడ్ కష్టకాలంలో రంజాన్ పండుగ నిర్వహించుకుంటున్న ముస్లింలకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా వైరస్ బారిన పడి ఇబ్బందులు పడకుండా, ఇళ్లలోనే ఉండి ప్రార్థనలు జరుపుకోవాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రాములు, కొవిడ్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ సతీష్ రాథోడ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.