కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే పనిలో ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేయడంతోపాటు మరో 50 వేల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నది. 90 శాతం మంది ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారు. డబ్బులకు ఆశపడి ఓటును అమ్ముకోవద్దు. -మంత్రి హరీశ్రావు
రెండేండ్ల కోసమే ఈ ఎన్నికలు..
బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈ ప్రాంతానికి ఏం పనులు చేశారు?. రేపు ఈటల రాజేందర్ గెలిస్తే ఏం పనులు చేయలేడు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల 17 ఏండ్లపాటు పదవిలో ఉండి హుజూరాబాద్ నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టాడు?. ఇప్పుడు వచ్చేది ఐదేండ్ల ఎన్నికలు కాదు. కేవలం రెండేండ్ల కోసం మాత్రమే.. ఈ ఎన్నికలో రెండు గుంటల నిరుపేద అయిన గెల్లు శ్రీనివాస్ను గెలిపిస్తే ఈ రెండేండ్లలోనే అభివృద్ధిలో తన సత్తా చాటుతాడు. -తన్నీరు హరీశ్రావు, మంత్రి
జమ్మికుంట చౌరస్తా / జమ్మికుంట, సెప్టెంబర్ 21: ‘రాబోయే ఉప ఎన్నికల్లో మీరంతా అభివృద్ధి వైపు ఉన్న టీఆర్ఎస్ దారిని ఎంచుకుంటారా?.. పన్నులేసి ప్రజలను పీడిస్తున్న బీజేపీ దారిని ఎంచుకుంటారా?’ అని హుజూరాబాద్ నియోజకవర్గ ఓటర్లను ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్స్లో జరిగిన సమావేశంలో 4, 5, 7, 8, 9, 10, 11వ వార్డులకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర వర్గాలకు చెందిన దాదాపు వెయ్యి మంది మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యికి పెంచిన బీజేపీకి ఓటు ఎలా వేస్తారని?, ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈ ప్రాంతానికి ఏం చేశాడని ప్రశ్నించారు. రేపు ఈటల రాజేందర్ గెలిస్తే కూడా ఏమీ చేయలేడని చెప్పారు.
ఉద్యోగాలను ఊడగొడుతున్న బీజేపీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే పనిలో ఉన్నదని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేయడంతోపాటు మరో 50 వేల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నదన్నారు. 90 శాతం మంది ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని తెలిపారు. డబ్బులకు ఆశపడి ఓటును అమ్ముకోవద్దని సూచించారు. విద్యావంతుడు, రెండు గుంటల నిరుపేద గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే రెండేండ్లలోనే అభివృద్ధిలో తన సత్తా చాటుతాడని చెప్పారు. తానూ నెలకోసారి ఇక్కడికొచ్చి పనులను పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, వరంగల్ తూర్పు, రామగుండం ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు పాల్గొన్నారు.
ఐటీఐఆర్ ఎప్పుడిస్తారు?
మన దగ్గర మంజూరైన ఐటీఐఆర్ను ఎప్పుడు ఇస్తారో చెప్పాలని హరీశ్రావు బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఇల్లు జాగ లేనివారికి జాగ ఇచ్చి డబుల్బెడ్రూం ఇండ్లు, సొంత స్థలం ఉంటే అదే స్థలంలో నివాస గృహాలను కట్టిస్తామన్నారు. నాయిని చెరువును మురికి కూపం నుంచి తప్పించి మంచినీటి చెరువుగా మార్చేందుకు రూ. 1.5 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. ఈ చెరువు వద్ద ప్రత్యేక ప్లాట్ఫారాలు నిర్మిస్తామని చెప్పారు.