కరోనా వేళ అనాథ శవాలకు అంత్యక్రియలు
మానవత్వాన్ని చాటుకుంటున్న వేల్పూర్ యువకులు
కరోనా మహమ్మారి కండ్ల ముందే మనుషులను మాయం చేస్తున్నది. మానవ సంబంధాలను తెంచుతున్నది. ప్రేమానురాగాలను మటుమాయం చేస్తున్నది. మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. అందరూ ఉన్నా..అనాథగానే వెళ్లిపోవాల్సిన దుర్భర పరిస్థితి దాపురించింది. అయినవారి కడచూపు కూడా నోచుకోలేకపోతున్న ఘటనలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. సాధారణంగా వ్యక్తి మృతిచెందినా అనుమానంగానే చూస్తున్నారు. ఆ వైపు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. కరోనాతో మృతిచెందితే కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్న సంఘటనలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లాభాపేక్ష లేకుండా అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు వేల్పూర్కు చెందిన ముగ్గురు యువకులు. -వేల్పూర్, మే 25
స్వచ్ఛందంగా దహన సంస్కారాలు
కరోనాతో చనిపోయిన వారిని చూసి వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ తీగల రాధ భర్త తీగల మోహన్, ఉపసర్పంచ్ పిట్ల సత్యం, ఎంపీటీసీ మొండి మహేశ్ చలించిపోయారు. కన్నవారు, బంధువులు, స్నేహితులు ఎవరు చనిపోయినా మృతదేహం దగ్గరకు రాకపోవడం వారిని కలచివేసింది. అప్పటి నుంచి గ్రామంలో ఎవరు చనిపోయినా దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయిన వారు రాకపోయినా అంతా తామై దహన సంస్కారాలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కరోనాతో మరణించిన వారి మృతదేహాలను అంబులెన్స్లో నేరుగా శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
సంప్రదాయం ప్రకారం..
ఎలాంటి మనిషి అయినా చివరికి చనిపోవాల్సిందే. కరోనాతో చనిపోయిన వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం చివరి చూపు చూడడానికి ఇబ్బంది పడుతున్నారు. కుటుంబసభ్యులు చనిపోయినా అలాగే వదిలేస్తున్నారు. అలాంటి శవాలకు మేం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం.
అవగాహన పెంచుకోవాలి
మృతదేహం నుంచి కరోనా వస్తుందేమోనని అందరూ దూరంగా ఉంటున్నారు. మృతదేహం నుంచి వైరస్ వ్యాప్తి చెందదు. బతికున్నప్పుడు నోటి తుంపర్లు పడితే వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇంకా ఎంతకాలం భయపడతాం. ప్రస్తుత పరిస్థితులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి.
-మొండి మహేశ్, ఎంపీటీసీ
సేవను అదృష్టంగా భావిస్తున్నా..
ఏ మనిషైనా ఎలా బతికినా చనిపోయిన తర్వాత అతడిని సగౌరవంగా చివరి మజిలీకి చేర్చడం, అంత్యక్రియలు నిర్వహించడం ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రావడం లేదు. అలాంటి వారిని చివరి మజిలీకి చేర్చాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం.ఈ సేవను అదృష్టంగా భావిస్తున్నా..
-తీగల మోహన్, సర్పంచ్ భర్త