సమితి కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు వెల్లడి
అమీర్పేట్, జూలై 29: తెలంగాణ రాష్ట్ర అర్చక, ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి ఇకనుంచి టీఎన్జీవోకు అనుబంధంగా పనిచేస్తుందని సమితి కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు, కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. గురువారం సనత్నగర్ హనుమాన్ దేవస్థానం ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దేవాదాయశాఖ అర్చకులు, ఉద్యోగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే దిశగా టీఎన్జీవోలతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. అర్చక, ఉద్యోగుల వేతనాల విషయంలో కటాఫ్ తేదీని తొలగించి, జీవో 577 ప్రకారం 2017 వరకు ఆలయాల్లో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగులందరికీ జీఐఏ ద్వారా వేతనాలను చెల్లించేలా కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో జేఏసీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కొండూరి కృష్ణమాచారి, ముఖ్య కార్యదర్శి బద్రీనాథాచార్యులు, ప్రధాన కార్యదర్శి రిపుంజయ శర్మ, ఉపాధ్యక్షుడు రాజేశ్వరశర్మ, ప్రతినిధులు కాటం శ్రీనివాస్గౌడ్, ప్రకాశ్, కిశోర్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.