హైదరాబాద్, జూలై 16 (నమస్తేతెలంగాణ): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సంచలన నిర్ణయం తీసుకొన్నది. గ్రూప్-1 పోస్టులు మినహా ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ప్రిలిమ్స్కు సంబంధించిన జీవోలు 39, 150 రద్దుచేయాలని ఆ రాష్ట్ర సర్కారును కోరింది. గ్రూప్-1 ఇంటర్వ్యూల స్థానంలో వేరే విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, కొత్త నోటిఫికేషన్లు ఆగస్టులో విడుదల కానున్నట్టు వెల్లడించింది. త్వరలో 1,184 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది. ఆగస్టు నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది. ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి 47 ఏండ్లకు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తున్నట్టు వివరించింది.