కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారానికి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన హామీ మేరకు కృష్ణా జలాల కేటాయింపులపై సుప్రీంకోర్టులో దాఖలుచేసిన కేసును ఉపసంహరించుకొంటున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. కేసును ఉపసంహరించుకుంటున్నట్టు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రతిని జతపరిచారు.
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): బ్రిజేశ్కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్ 2010లో ఇచ్చిన కేటాయింపులతో 2014లో ఏర్పడిన తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని ప్రభుత్వం మొదటినుంచీ వాదిస్తున్నది. తెలంగాణను కూడా కలిపి మరోసారి కేటాయింపులు జరుపాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రెండు రాష్ర్టాల మధ్య నీటి పంపకాలపై పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటుచేసిన బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్తో సైతం న్యాయం జరుగడం లేదని వాదిస్తున్నది. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం- 1956లోని సెక్షన్ 03 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లోనూ ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నది. గతేడాది అక్టోబర్లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే డిమాండ్ను వినిపించింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకుంటే పరిశీలిస్తామని కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి పేర్కొన్నారు. దీంతో కేసును ఉపసంహరించుకుంటామని సీఎం కేసీఆర్ కేంద్రానికి తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే కేసు ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది.