హైదరాబాద్, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బందికి రూ.2 వేల నగదు, 25 కిలోల బియ్యం పథకం అమలులో విద్యాశాఖ మరో వెసులుబాటు కల్పించింది. యూనిఫైడ్-డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టం (యూ-డైస్)లో పేర్లు లేనివారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చారు. యూ-డైస్ సమాచారం ప్రకారం రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో 1.45 లక్షల మంది పనిచేస్తున్నట్టు గుర్తించారు. వీరిలో చాలామంది వివరాలను వారి పాఠశాల యాజమాన్యాలు యూ-డైస్లో నమోదుచేయలేదు. కొన్ని పాఠశాలలు తమవద్ద ఒకరిద్దరు మాత్రమే పనిచేస్తున్నట్టు నమోదుచేయగా, మరికొన్ని పాఠశాలలు జీరోగా పేర్కొ న్నాయి. దీంతో ఆయా పాఠశాలల్లో పనిచేసినవారంతా లబ్ధి పొందలేని పరిస్థితి నెలకొన్నది. జిల్లాల నుంచి ఈ అంశంపై వందల ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు యూ-డైస్లో పేర్లులేని వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చారు. దరఖాస్తుదారులు తమ పేరు, బ్యాంకు అకౌంట్ నంబర్, సెల్ఫోన్, ఆధార్నంబర్లను సక్రమంగా పేర్కొనాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తు న్నారు. ఈ వివరాలు సవ్యంగా ఉంటేనే ఆన్లైన్లో నగదు బదిలీ అవుతుందని పేర్కొన్నారు. ఈ పథకానికి నాలుగు రోజుల్లోనే 1.45 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. సోమవారం వరకు 1.25 లక్షల దరఖాస్తులు రాగా, మంగళవారానికి 1.45 లక్షలకు చేరుకొన్నాయి.