కరోనాతో లంగ్స్ చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో శ్రీనివాస్
ఆదుకోవాలని భార్య వేడుకోలు
అందమైన కుటుంబం.. చూడచక్కని జంట.. పెండ్లి చేసుకొని కొత్త జీవితంలో అడుగు పెట్టారు. కానీ ఇంతలోనే మాయదారి కరోనా ఆ కుటుంబాన్ని పగబట్టింది. ఆ యువకుడి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నది. గోదావరిఖని నగరంలోని పవర్హౌస్ కాలనీకి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు పందిల్ల రాజయ్యకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు శ్రీనివాస్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, మూడేండ్ల క్రితం మౌనికను వివాహం చేసుకున్నాడు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ దంపతులు, తమ భవిష్యత్ కోసం ఇప్పుడిప్పుడే కలల సౌధం నిర్మించుకుంటున్నారు. ఇంతలోనే కరోనా ఆ కుటుంబంలో అలజడి రేపింది. శ్రీనివాస్ కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్తో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విష మించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
శ్రీనివాస్ రెండు ఊపిరితిత్తులు చెడిపోయాయనీ, శస్త్ర చికిత్స కోసం చాలా ఖర్చు అవుతుందని చెప్పగా, శ్రీనివాస్ భార్య మౌనికకు ఒక్కసారిగా గుండె ఆగినంతపనైంది. అసలే సాధారణ కుటుంబం మాది.. ఇప్పటికిప్పుడు లక్షల్లో డబ్బులు తేవడం అంటే ఎక్కడికి వెళ్లేది అంటూ కన్నీరు మున్నీరవుతున్నది. పక్షం రోజులుగా దవాఖానలో ఉన్నందుకే రూ.20లక్షల వరకు ఖర్చయ్యాయని, ఇంకా 50 లక్షలకు పైగానే ఖర్చు అవుతాయని డాక్టర్లు చెబుతున్నారనీ, ఈ పరిస్థితిలో నా భర్తను బతికించేందుకు ఆపన్నహస్తం అందించేందుకు దాతలు సాయం చేయాలంటూ ఆ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం చేయాలనుకునేవారు గూగుల్ పే/ఫోన్ పే నంబర్ 9121683884 లేదా అకౌంట్ నంబర్ 62055 254393, ఐఎఫ్ఎస్సీ కోడ్:ఎస్బీఐఎన్0020087కు తమకు తోచినంతగా సాయం అందించాలని వేడుకుంటున్నారు.