‘బాహుబలి’ చిత్రంతో హీరోగా జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రభాస్. ఈ చిత్ర అద్వితీయ విజయం అనంతరం బాలీవుడ్ అగ్రదర్శకులు సైతం ప్రభాస్తో సినిమా చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ప్రభాస్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్(‘వార్’ ఫేమ్) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ ‘రా’ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. రోమాంచితమైన యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లోనే జరుగనున్నట్లు చెబుతున్నారు. బాలీవుడ్తో పాటు దక్షిణాదికి చెందిన అగ్రనటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. త్వరలో చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’, ‘సలార్’ సినిమాల్లో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించారు.