హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు విధిస్తూ ఇటీవల ఇచ్చిన తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఈ అంశంపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. హుస్సేన్సాగర్తోపాటు చెరువుల్లో పర్యావరణహితమైన విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ), సింథటిక్, రసాయనాలతో తయారైన విగ్రహాలను బేబీ పాండ్స్లో (చిన్న నీటికుంటల్లో) నిమజ్జనం చేయాలని గత గురువారం ఇచ్చిన తీర్పులో హైకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఈ తీర్పును సవరించి హుస్సేన్సాగర్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతించాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ సోమవారం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, జస్టిస్ టీ వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. జీహెచ్ఎంసీ, ఇతర శాఖల అధికారులు నివేదించిన సమాచారాన్ని పరిశీలించాకే తాము తీర్పు ఇచ్చామని, దీనిపై ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని తెలిపింది. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మానవాళి మనగడకే ముప్పు ఏర్పడుతుందని ధర్మాసనం పేర్కొంటూ రివ్యూ పిటిషన్ను కొట్టివేసింది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
పీవోపీ, రసాయనాలతో తయారుచేసిన విగ్రహాలను బేబీ పాండ్స్లోనే నిమజ్జనం చేయాలని హైకోర్టు స్పష్టం చేయడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. 30 సర్కిళ్ల పరిధిలోని 25 కోనేరుల్లో నిమజ్జనాలు జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం కోనేర్లను పూర్తి స్థాయిలో నీటిని నింపనున్నారు. భక్తులు కోనేరులో దిగకుండా క్రేన్ల సాయంతో విగ్రహాలను నిమజ్జనం చేసేలా అధికారులు ఫ్లాన్ చేస్తున్నారు. నిమజ్జనాల కోసం పోలీస్ స్టేషన్ల వారీగా మండపాలకు టోకెన్లు ఇవ్వనున్నారు. నిమజ్జనం ఎప్పుడు, ఎక్కడ చేయాలన్న వివరాలు ఆ టోకెన్లలోనే ఉంటాయని అధికారులు చెప్తున్నారు. క్రేన్ల సాయంతో కోనేరుల్లో దించిన విగ్రహాలను వెంటనే బయటకు తీసి వాహనాల్లో తరలించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. చిన్న విగ్రహాలను ఎక్కడికక్కడే నిమజ్జనం జరిపిస్తామని స్పష్టం చేశారు.
నిమజ్జనంపై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): పీవోపీతో తయారు చేసిన గణనాథులను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సోమవారం సీఎం కేసీఆర్ పురపాలక, పోలీసు అధికారులు, అడ్వకేట్ జనరల్తో సమావేశమయ్యారు. హైదరాబాద్ మహానగరం వ్యాప్తంగా గణనాథులు కొలువుతీరారు. ఇప్పటికే నిమజ్జనాలు మొదలయ్యాయి. పూర్తిస్థాయి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లనుకూడా రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్సాగర్ చుట్టూరా చేసింది. ఈ నేపథ్యంలో పీవోపీ విగ్రహాలను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయకూడదని హైకోర్టు తీర్పు వెలువరించటంతో అయోమయ పరిస్థితి నెలకొనడంతో దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.