హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ)/మహబూబ్నగర్, చింతలపాలెం, నందకొండ: అనుమతులు లేకుండా అక్రమ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అన్ని హక్కులూ ఉండి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న తెలంగాణను అడ్డుకొనేందుకు కుయుక్తులు పన్నుతున్నది. ఏపీ రాజకీయ నేతలు, ఇంజినీరింగ్ అధికారులు లేఖల పేరిట తెలంగాణ ప్రాజెక్టుల వద్దకు వచ్చి హంగామా చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్లోని అన్ని ప్రాజెక్టుల వద్ద బందోబస్తును పటిష్టంచేసింది. వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఏపీ అధికారులు ఏకకాలంలో ఒకరి తర్వాత ఒకరు ప్రాజెక్టు సైట్ల వద్ద గురువారం హంగామా చేశారు. పులిచింతల ప్రాజెక్టు ఎస్ఈ రమేశ్బాబు విద్యుత్తు ఉత్పత్తి నిలిపేయాలని తెలంగాణ జెన్కో ఎస్ఈ దేశ్యానాయక్కు వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు. సాగర్ కుడి కాలువ ఎస్ఈ గంగరాజు ఆధ్వర్యంలో ఏపీ అధికారుల బృందం కరెంటు ఉత్పత్తిని ఆపాలని ప్రధాన జలవిద్యుత్తు కేంద్రం సీఈ సూర్యనారాయణను కలిసే నెపంతో లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.
అప్రమత్తమైన తెలంగాణ సర్కారు
ఏపీ అధికారులు, నేతల తీరుతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. శ్రీశైలం ఎడమ విద్యుత్తు కేంద్రం, సాగర్ ప్రధాన విద్యుత్తు కేంద్రం, సూర్యాపేట జిల్లా చింతలపాలెంలోని పులిచింతల విద్యుత్తు కేంద్రం, జూరాల రిజర్వాయర్ల వద్ద అదనపు బలగాలను మోహరించింది. వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. జూరాల ప్రాజెక్టు ప్రధాన ద్వారం వద్ద పికెట్ను ఏర్పాటుచేశారు. సాగర్లోని విద్యుత్తు ప్లాంట్కు వెళ్లే రహదారిని మూసివేశారు. సూర్యాపేట ఎస్పీ భాస్కరన్ పర్యవేక్షణలో పులిచింతల ప్రాజెక్టు వద్ద 200 మంది పోలీసులను మోహరించారు. నాగార్జునసాగర్ వద్ద 300 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు నల్లగొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు. జోగులాంబ గద్వాల ఎస్పీ రంజన్ రతన్కుమార్ జూరాల ప్రాజెక్టు వద్ద భద్రతను సమీక్షించారు.