తొగుట, ఏప్రిల్ 07: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఆదేశాల మేరకు సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు గజ్వేల్ పట్టణంలోని ముట్రాజ్పల్లి గల ఆర్అండ్ఆర్ కాలనీలో ఉంటూ ముంపు గ్రామస్తులకు ఇండ్లు కేటాయించడతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఊరు పోయిందంటే ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ, పది మంది మేలు కోసం ప్రాజెక్టు నిర్మిస్తున్నారు కాబట్టి మాకు కూడా త్యాగం చేసినట్లు ఉందని ముంపు గ్రామస్తులు గర్వంగా చెబుతున్నారు. పొలాలతో పాటు చెట్టు, చేమ, వ్యవసాయేతర ఆస్తులు, ఇల్లు, వాకిలికి ప్రభుత్వం పరిహారం అందించింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం 17,590 ఎకరాలను సేకరించారు. 2013 చట్టం ప్రకారం ఒక కుటుంబానికి 75 గజాల స్థలం, ఇందిరా ఆవాస యోజన కింద ఇండ్ల నిర్మాణం, ఇల్లు వద్దనుకుంటే కేవలం రూ. 1.50 లక్షలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.
ముంపు గ్రామాల ప్రజలు నష్టపోతున్నారని సీఎం కేసీఆర్ గ్రహించి, వారికి లబ్ధి చేకూర్చడానికి ప్రతి కుటుంబానికి 250 గజాల ప్లాట్, అందులో డబుల్ బెడ్రూం ఇల్ల్లు, ఇల్లు వద్దనుకుంటే రూ.5,04,000, అలాగే పరిహారం రూపేనా రూ.7,50,000 ఇచ్చారు. ప్రతి కుటుంబంలో 18 ఏండ్లు నిండిన వారిని ఒక కుటుంబంగా భావించి, వారికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు పరిహారం కింద రూ.500,000 అందిస్తున్నారు. కేంద్ర చట్టం ప్రకారం ఇంటి విలువకు పరిహారం రూ. 1.25 లక్షలు కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 5.04లక్షలు ఇచ్చింది. ఎకరాకు రూ. 6.36లక్షల పరిహారం ఇవ్వాల్సి ఉండగా, ఇక్కడ రూ. 7.50 లక్షల వరకు ఇచ్చింది. గ్రామాల్లో ఇచ్చే ఇంటి స్థలాలను గజ్వేల్ పట్టణంలో ఇస్తుండడంతో దాని విలువ పెరిగిపోయింది.
ఖాళీ అవుతున్న మల్లన్న సాగర్…
మల్లన్న సాగర్ ప్రాజెక్టులో తొగుట మండలంలోని పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్-వడ్డెర కాలనీ, బ్రాహ్మణ బంజేరుపల్లి గ్రామాలతో పాటు కొండపాక మండలంలోని తిప్పారం, సింగారం, ఎర్రవల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇప్పటికే కొండపాక మండలంలోని ముంపు గ్రామాలు ఖాళీ చేశారు. తొగుట మండలంలోని రాంపూర్, లక్ష్మాపూర్ గ్రామాలు పూర్తిగా ఖాళీ చేసి ముట్రాజ్పల్లి-సంగాపూర్ వద్ద గల డబుల్ బెడ్రూం కాలనీలోకి వెళ్ల్లారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకోవడంతో గ్రామాలు ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డితో పాటు తొగుట తహసీల్దార్ బాల్రెడ్డి, సర్పంచ్లు సిద్దిపేట బాలయ్య, దామరంచ ప్రతాప్రెడ్డి, గుగ్లోతు చిన్న రజితతో పాటు ప్రజా ప్రతినిధులు, కుల సంఘాలతో సమావేశం నిర్వహించి, వారికి ముట్రాజ్పల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించారు.పల్లెపహాడ్, వేములఘాట్ గ్రామస్తులు ఇంటిలోని వస్తువులను వాహనాల్లోకి సదురుకొని గజ్వేల్లోని ఆర్అండ్ఆర్ కాలనీకి వచ్చి సామూహిక గృహ ప్రవేశాలు చేస్తున్నారు. బుధవారం పల్లెపహాడ్ నుంచి 98 డీసీఎంలలో 103 కుటుంబాలు, వేములఘాట్ నుంచి 120 డీసీఎంలలో 142 కుటుంబాలు గృహప్రవేశాలు చేశాయి. వారం రోజుల్లో పూర్తి స్థాయిలో వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాలు ఖాళీ కానున్నాయి. తర్వాత ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాన్ని ఖాళీ చేయనున్నారు.
ముంపు బాధితులకు అండగా ఉంటున్నాం..
లక్షలాది ఎకరాలకు సాగునీరందించడానికి పుట్టిన ఊరును, పంట పొలాలను, ఉపాధిని కోల్పోయిన ముంపు గ్రామస్తుల త్యాగాలు మరువలేనివి. వారికి అన్ని వసతులతో ఆర్ఆండ్ఆర్ కాలనీలో గూడు కల్పిస్తున్నాం. ముంపు గ్రామస్తులు ఎంతో సహకారం అందిస్తున్నారు. మిగతా వాళ్లు కూడా ఖాళీ చేసి గజ్వేల్కు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ముంపు గ్రామస్తులకు న్యాయ బద్ధంగా రావాల్సిన పరిహారం అందిస్తాం. ఎవరికైనా అందకపోతే న్యాయం చేస్తాం.
-అనంతరెడ్డి, సిద్దిపేట ఆర్డీవో
ఆగమైతామనుకున్నాం..
ప్రాజెక్టులో ఊరు మునిగిపోతే ఇక మమ్మల్ని పట్టించుకోరని, ఆగమైపోతామనుకున్నాం. కానీ, సీఎం కేసీఆర్ సార్ మాకు పంట పొలాలకు, ఇల్లు, ఇంటి స్థలం, చెట్టు చేమకు కూడా పరిహారం ఇచ్చారు. కుల్లా స్థలంలో డబుల్ బెడ్రూం నిర్మించి ఇచ్చాడు. ఆయన మేలు మరువలేనిది.
-పల్లిపేట విజయ, వేములఘాట్
మా పిల్లలకు ఉపాధి సూపించాలి..
సీఎం కేసీఆర్ ముంపు గ్రామాల ప్రజలకు అండగా నిలుస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోనే గూడు కల్పించి తానున్నానని భరోసా ఇచ్చాడు. పరిహారం, ఇంటి సౌకర్యం బాగానే ఉంది. యువకులకు కాస్త ఉపాధి అవకాశం కల్పించాలని కోరుతున్నాం.
-పల్లిపేట సత్తాగౌడ్, వేములఘాట్
పేదలకు అండగా సీఎం కేసీఆర్ సార్..
గతంలో రైతులను ఎవ్వరూ పట్టించుకోలేదు. సాగునీటి కోసం బోర్లు ఏసి ఏసి ఎంతోమంది ఆగమైపోయారు. వేలాదిమందికి సాగునీరు అందించడానికి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ సార్ పడుతున్న తాపత్రయాన్ని అర్ధం చేసుకున్నాము. మా త్యాగం వల్లనే నీళ్లు వస్తున్నాయన్న సంతోషం మాలో ఉంది. కొత్త ఇంట్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది.
-నీరడి యాదగిరి, వేములఘాట్
సీఎం కేసీఆర్ దేవుడు..
ప్రాజెక్టుల కింద భూములు, ఇండ్లు కోల్పోయిన వారు సమైక్య రాష్ట్రంలో పరిహారం అందక కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మేము త్యాగం చేసినందుకు సీఎం కేసీఆర్ పరిహారంతో పాటు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇవ్వడంతో మాకు భరోసా ఏర్పడింది. 250 గజాల స్థలం కేటాయించడం, అందులో ఇంటి నిర్మాణం చేయడంతో పాటు ఏమైనా ఆర్థ్ధిక ఇబ్బంధులు ఏర్పడితే అందులో కొంత ఖాళీ స్థలం అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు.
-సింగరబోయిన లలిత నాగరాజు, పల్లెపహాడ్ ఉప సర్పంచ్
ఇవీ కూడా చదవండీ…
ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా గుర్తించడం సంతోషకరం