హైదరాబాద్ : తెలంగాణ సహా, చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నిశాఖల అధికారులు, ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశించారు.
భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎంపీ బండ ప్రకాశ్, వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, వరంగల్ సీపీ, ఆయా జిల్లాల ఎస్పీలు, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సోమవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయరాదన్నారు.
అదే విధంగా గత సంవత్సరం వరంగల్ నగరంలో భారీ వర్షాల వల్ల వరద ప్రవాహం పెరిగి నష్టం జరిగిన దృష్ట్యా ప్రత్యేకంగా ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని మంత్రి దయాకర్ రావు కోరారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు అధికారులు తాము ముందస్తుగా తీసుకుంటున్న చర్యలను మంత్రి కి వివరించారు.
ఇవి కూడా చదవండి..
డీసీపీ కార్యాలయ సిబ్బంది ఔదార్యం..వృద్ధురాలికి చేయూత
Ind vs Eng | ఇంగ్లండ్ గెలుస్తుందా? చేజింగ్లో ఆ టీమ్ రికార్డేంటి? ఓవల్ పిచ్ ఎలా ఉంది?
కందకుర్తి వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహం