హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో అమలుచేస్తున్న మరో పథకం కేంద్ర ప్రభుత్వానికి ఆదర్శంగా మారిం ది. రాష్ట్రంలో నిర్వహిస్తున్న మొబైల్ వెటర్నరీ క్లినిక్, హాస్పిటల్ సేవలను దేశమంతా విస్తరింపజేస్తామని కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాల పేర్కొన్నారు. ఈ పథకం అద్భుతంగా ఉన్నదని ప్రశంసించారు. గురువారం దక్షిణభారతదేశానికి చెంది న పార్లమెంట్ సభ్యులతో వెబినార్ నిర్వహించారు. రాష్ట్రంలో మొబైల్ వెటర్నరీ క్లినిక్ల ద్వారా సాధించిన విజయాలను ఎంపీ డాక్టర్ బండా ప్రకాశ్ వివరించారు. ఈ పథకంపై ఆసక్తిచూపిన కేంద్ర మంత్రి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొబైల్ సేవలను దేశమంతా విస్తరింపజేస్తామని, వ్యాన్ నిర్వహణకయ్యే ఖర్చులో 60 శాతం కేంద్రం భరించేలా ఆదేశాలు జారీచేస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్టు బండా ప్రకాశ్ పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయంగా అభివర్ణించారు. కేంద్ర మంత్రి నిర్ణయం పట్ల ఎంపీ కృతజ్ఞతలు తెలియజేశారు.