హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): కరోనా నియంత్రణలో మేముసైతం అంటూ వైద్య సిబ్బందితో సమానంగా పోలీసులు కూడా కృషి చేస్తున్నారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పోలీసులు సమర్థంగా అమలుచేస్తున్నారు. రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. దాదాపు 18 రోజులుగా రోడ్లపైనే కాలం వెళ్లదీస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి ఆ శాఖ ఉన్నతాధికారులు బాసటగా నిలుస్తున్నారు. స్వయంగా డీజీపీ ఎం మహేందర్రెడ్డి మొదలు జోనల్ ఐజీలు, కమిషనర్లు, ఎస్పీలు.. ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. కార్యాలయాల్లో కూర్చొని ఆదేశాలివ్వడానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సిబ్బందిలో ైస్థెర్యాన్ని నింపుతున్నారు. దీంతో సిబ్బందిలో నూతనోత్సాహం కనిపిస్తున్నది. కేవలం విధుల గురించే కాకుండా తమ ఆరోగ్యం గురించి వాకబు చేయడం, సమయానికి భోజనం అందించడం సహా ఇతర అన్ని వసతులపైనా ఉన్నతాధికారులు దృష్టి పెడుతుండటంతో లాక్డౌన్ విధుల్లో ఉంటున్న సిబ్బంది కొంత సాంత్వన లభిస్తున్నది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, వెస్ట్జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి ఇతర ఉన్నతాధికారులు సిబ్బందితో స్వయంగా మాట్లాడుతూ వారిలో ధైర్యం చెప్తున్నారు.