గాజులరామారం, సెప్టెంబర్ 1: అసభ్య పదజాలంతో ఇతరులను దూషించి బెదిరింపులకు దిగిన కేసులో క్యూ న్యూస్ నిర్వాహకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను జగద్గిరిగుట్ట పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. జ్యోతిష్యుడిని బ్లాక్మెయిల్ చేసిన కేసులో ఇప్పటికే అరెస్టయి జైల్లో ఉన్న మల్లన్నకు ఈ కేసులో పీటీ వారెంట్ జారీచేసి వర్చువల్గానే కోర్టులో హాజరుపరిచారు. జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట కార్పొరేటర్ కొలుకుల జగన్పై క్యూ న్యూస్లో మల్లన్న తప్పుడు కథనాలను ప్రచారంచేసి ఆయన పరువుకు భంగం కలిగించాడని జగద్గిరిగుట్ట డివిజన్ సోమయ్యనగర్కు చెందిన సంపత్రెడ్డి కోర్టును ఆశ్రయించాడు. రాజీకి రావాలని లేకపోతే చంపేస్తామని జగద్గిరిగుట్టకు చెందిన గుంజ యెల్లేశ్, గుంజ వెంకటేశ్, గుంజ సీతారాం, తీన్మార్ మల్లన్న, జేకే శేఖర్యాదవ్, కల్లూరి పున్నారెడ్డి, గండి రాజుయాదవ్ తనను కొట్టి బెదిరించారని సంపత్ ఫిర్యాదు చేశాడు. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం ఆయన జైల్లో ఉండటంతో పీటీ వారెంట్పై వర్చువల్గా కోర్టులో హాజరుపరిచామని ఇన్స్పెక్టర్ సైదులు వివరించారు.