నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 29: ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ పథకం ద్వారా ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడంతోపాటు విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ముందడుగు వేస్తారని సంబురపడుతున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీర, పుష్పాభిషేకాలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, కల్లూరులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో దళితులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్, మానకొండూర్, శంకరపట్నం మండల కేంద్రాల్లో టీఅర్ఎస్ ఎస్సీసెల్, అంబేద్కర్, దళిత సంఘాల నాయకులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రసమయి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ స్వగృహంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండ, మాడ్గులపల్లి, నార్కట్పల్లి, శాలిగౌరారం, కనగల్లు, పెద్దవూర, నందికొండ హిల్కాలనీలో, తిరుమలగిరి సాగర్ మండలాల్లో, సూర్యాపేట జిల్లా కేంద్రంలో, తిరుమలగిరి, నేరేడుచర్ల మండలాల్లో టీఆర్ఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోటగిరి, రుద్రూర్, నస్రుల్లాబాద్ మండల కేంద్రాల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు.