తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు. అనంతరం పెద్దజీయర్స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. చిన్నజీయర్స్వామి, ఈవో, అదనపు ఈవో ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు.
తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ‘పరివట్టం’(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు పెద్దజీయంగారికి, చిన్న జీయంగారికి, టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి గారికి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచడంతో ఆణివార ఆస్థానం ముగిసింది.
శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ
ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారి ఆలయ అధికారులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్రవారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల పెద్ద జీయర్స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠం నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు : టిటిడి ఈవో
ఈ ఉత్సవం అనంతరం ఆలయం వెలుపల ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారని చెప్పారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వచ్చిందన్నారు. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చినట్టు వివరించారు. సాయంత్రం పుష్పపల్లకిపై స్వామి, అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.
కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్బాబు, దేవాదాయ శాఖ కార్యదర్శి చంద్రమోహన్, కమిషనర్ కుమరగురుభరన్, శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ మారిముత్తు, టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్బాబు, పేష్కార్ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి ఆలయం అత్యద్భుతం : ఏపీ మంత్రి పేర్ని నాని
విమర్శల పాలవుతున్న ప్రగ్యా ఠాకూర్.. ఎందుకంటే.?
పేదలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం
సానియా మీర్జా, షోయెబ్ జంటకు యూఏఈ గోల్డెన్ వీసా జారీ