హాలియా, మే 12 : రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డును బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. హాలియా మార్కెట్ పరిధిలో ఇప్పటి వరకు రైతుల వద్ద సుమారు లక్షా 25 వేల బస్తాల ధాన్యం కొనుగోలు చేయగా హాలియాలో 75 వేల బస్తాలు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్ సబ్ మార్కెట్ యార్డుల్లో 50 వేల బస్తాల ధాన్యం కొనుగోలు చేసినట్లు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యడవల్లి నీలిమా మహేందర్రెడ్డి తెలిపారు. గన్నీ సంచుల కొరత కారణంగా మూడు రోజులుగా మార్కెట్లో ధాన్యం కొనుగోలు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే నోముల భగత్ జిల్లా అధికారులతో మాట్లాడి లక్ష గన్నీ సంచులు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
అధికారులతో సమీక్షా సమావేశం.
యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లు, మార్కెటింగ్, పౌరసరఫరా ఇతర ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యే భగత్ హాలియాలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా పౌరసరఫరాల అధికారి నాగేశ్వర్రావు, మార్కెట్ డీఎంఓ శ్రీకాంత్, హాలియా తాసీల్దార్ కృష్ణయ్య, ఏఓ సంతోషిని, ఏపీఎం కళావతి, మార్కెట్ అధికారులు హాజరయ్యారు. సాగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రైతులు వద్ద 60 శాతం ధాన్యం సుమారు 20 లక్షల బస్తాలు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. రైతుల వద్ద ఉన్న పూర్తి ధాన్యం కొనుగోలుకు మరో 8 నుంచి 10 లక్షల గన్నీ సంచులు అవసరం అవుతాయని అంచనా వేశారు. రవాణా, గన్నీ సంచుల కొరత లేకుండా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ రైతుల అవసరాలకు తగ్గట్టుగా అధికారులు గన్నీ బ్యాగ్స్ సరఫరా చేయాలని సూచించారు. జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ పేర్ల సుమతీపురుషోత్తం, మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మా శంకరయ్య, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు రావుల చినభిక్షం, మార్కెట్ వైస్ చైర్మన్ రవి, డైరెక్టర్లు ఆవుల సైదులు, రావుల లింగయ్య, పల్రెడ్డి రఘురాంరెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి, మార్కెట్ సూపర్వైజర్ ఎండీ ఖలీల్, రావుల చినభిక్షం తదితరులు పాల్గొన్నారు.