హైదరాబాద్, అక్టోబర్14 (నమస్తే తెలంగాణ): కృష్ణానదిపై ఉన్న అన్ని జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను, ముఖ్యంగా తెలంగాణ జల విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఏపీ ఇప్పుడు రూటు మార్చింది. రివర్బోర్డ్ అధికార పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీచేసిన గెజిట్ గురువారం నుంచి అమలులోకి రావాల్సి ఉంది. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లోని పలు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి స్వాధీనం చేస్తూ గురువారం జీవో జారీచేసింది. అందులో శ్రీశైలం కుడిగట్టుపై ఉన్న జలవిద్యుత్తు కేంద్రం లేకపోవడం గమనార్హం.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాకుండా దాని పరిధిలోని ఇతర కాలువలు కూడా లేవు. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం షెడ్యూల్డ్-2లోని ప్రాజెక్టుల పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలన్నీ కేఆర్ఎంబీ చూసుకుంటుంది. అందులో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలోని అనుబంధ కాలువలు ఉన్నాయి. అదీగాక ఆది నుంచి తెలంగాణ ప్రాజెక్టులను, జలవిద్యుత్తు కేంద్రాలను కూడా స్వాధీనం చేసుకోవాలని బోర్డ్ ఎదుట ఏపీ డిమాండ్ చేస్తూ వస్తున్నది. వివాదాల్లేని, ఉమ్మడి ప్రాజెక్టులు కానివాటినీ స్వాధీనం చేసుకోవాలని పేచీలు పెడుతున్నది. కానీ తన వరకు వచ్చేసరికి ఏపీ ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తున్నది.
తాజాగా కేఆర్ఎంబీకి పలు ప్రాజెక్టులను స్వాధీనం చేస్తూ జారీ చేసిన జీవోలో శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్వే, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ, ముచ్చుమర్రి పంప్హౌస్, హంద్రీనీవా సుజలస్రవంతి లిఫ్ట్ స్కీమ్ను మాత్రమే చేర్చి ద్వంద్వనీతిని ప్రదర్శించింది. అదీగాక తెలంగాణ తన ప్రాజెక్టులను అప్పగించాకే, బోర్డు పరిధిలోకి తమ ప్రాజెక్టులను తీసుకొస్తామని మెలిక పెట్టడం కొసమెరుపు.