సిద్దిపేట అర్బన్, మే 8 : సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మంగోల్లో చారిత్రక వస్తు, విశేషాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, కొలిపాక శ్రీనివాస్ శనివారం తెలిపారు. మొగల్ పాలకుల వల్ల మంగోల్కు ఆ పేరు వచ్చిందని చెప్పారు. ప్రాచీన, చారిత్రక మంగోల్లోని కోటలో పెద్ద రాతికట్టడాలు, డంగు సున్నంతో నిర్మించిన ఎత్తైన గోడలు,కాపాలదారులతో గడి ప్రవేశ ద్వారం, బారాబందీ కోసం ఏర్పాట్లున్నాయని వెల్లడించారు. గడి బయట గోడలో తాపడం చేసిన దేవతా విగ్రహమున్నదని చెప్పారు. తలపై పడగ విప్పిన సర్పమే కిరీటంగా ఉండగా, చెవులకు గుండ్రని కుండలాలు, పెద్ద కండ్లు, మెడలో కంఠికతో దేవత కనిపిస్తున్నదని వివరించారు. గడి పాలకులు ప్రతిష్ఠించుకున్న రక్షక దేవత అయి ఉండవచ్చని పేర్కొన్నారు. గ్రామంలోని శివాలయంలో ఉన్న నంది చాళుక్యుల కాలం నాటిదని చెప్పారు. గర్భగుడిలోని శివలింగం కాకతీయశైలిలో ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ గుడిలో 17,18వ శతాబ్దాల నాటి సప్తాశ్వారూఢుడైన సూర్యుని విగ్రహం, బౌద్ధంలో కనిపించే నాగముచుళిందను పోలిన నాగశిల్పం ఉన్నదని పేర్కొన్నారు. 8, 9వ శతాబ్దాలనాటి రాష్ట్ర కూటుల కాలం నాటి గణపతి శిల్పాన్ని గ్రామం బయట గుర్తించామని చెప్పారు.