ప్రాకృతిక రాతి స్తంభాలను గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని రిజర్వు ఫారెస్ట్లో ప్రాకృతిక రాతి స్తంభాలు వెలుగుచూశాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం వీటిని కనుగొన్నది. వీటిని బసాల్ట్ శిలా స్తంభాలుగా పిలుస్తారని బృందం సభ్యుడు జీఎస్ఐ మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాల్ తెలిపారు. ఆరు కోట్ల ఏండ్లక్రితం అగ్ని పర్వత విస్ఫొటనంతో దాదాపు భూభాగమంతా లావా ప్రవహించింది. అందులో దక్కన్ ద్వీపకల్పం కూడా ఉన్నది. లావా చల్లారుతున్న సమయంలో మధ్య, పశ్చిమ భారతదేశంలో లావా శిలలు వివిధ రూపాలు సంతరించుకున్నాయి. వాటిని కాలమ్నార్ బసాల్ట్లని పిలుస్తారు. తెలంగాణలో రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భూగర్భంలోనుంచి బయటకు వచ్చినట్టు ఈ శిలారూపాలు కనిపిస్తాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇలాంటి భూభౌతిక రూపాలు జియో టూరిజం కేంద్రాలుగా ఏర్పాటయ్యాయి.