హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): పటాన్చెరు మండలం పోచారం రింగురోడ్డు సమీపంలోని ఒక చెట్టు కింద దేవరగా పూజలందుకుంటున్న శిల్పం జైనులకు సంబంధించిన కమఠోపసర్గ పార్శనాథుని శిల్పమని కొత్త తెలంగాణ చరిత్ర బృందం అభిప్రాయపడింది. ఈ ప్రాంతంలో కనిపిస్తున్న శిల్పాలు ప్రపంచంలోనే అరుదైనవని, వీటిలో దశ భావాల పార్శనాథుని విగ్రహాలకు ఎంతో ప్రత్యేకత ఉన్నదని కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. రాష్ట్ర కూటులు, కల్యాణి చాళుక్యుల కాలంలో పటాన్చెరు ప్రసిద్ధ జైన కేంద్రంగా ఉండేదని చెప్పారు. ఇక్కడే జైన శిల్పాలను తయారుచేసి, జైన బసదులు నిర్మించే ప్రాంతానికి వాటిని పంపేవారని వివరించారు. పటాన్చెరు, చుట్టుపక్కల ప్రాంతాలలో విరివిగా జైనశిల్పాలు కనిపిస్తుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.