హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఔషధంపై హైకోర్టులో సోమవారం విచారణ జరుగనున్నదని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. సీసీఆర్ఏఎస్ అధ్యయన తుది నివేదిక శనివారం సాయంత్రానికి వస్తుందని, దానిని అధ్యయన కమిటీ మరోసారి పరిశీలిస్తుందని పేర్కొన్నారు. నివేదికతోపాటు హైకోర్టు తీర్పు వచ్చాక ఔషధ పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు. టెలిఫోన్ విచారణలో ఆనందయ్య ఔషధంపై ఇప్పటివరకు నివేదికలు సానుకూలంగా వచ్చాయని తెలిపారు. ఔషధంపై క్లినికల్ ట్రయల్స్ ఇంకా ప్రారంభించలేదని వెల్లడించారు.
ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య వారం రోజుల తర్వాత సొంత ఇంటికి చేరుకున్నారు. ఆనందయ్యను చూడటానికి గ్రామస్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లుచేశారు. భద్రత దృష్ట్యా ఆనందయ్యను మళ్లీ నెల్లూరుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లుచేశారు.