ఆర్కేపురం, మార్చి 16: అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోయారు. చిత్ర లేఅవుట్ కాలనీలోని అనాథ విద్యార్థి గృహమే సొంత ఇల్లు అయ్యి ఆశ్రయం ఇచ్చింది. అమ్మలా సాకింది. దాంతో అనాథనన్న బాధను మరిచి సరస్వతీ పుత్రుడిగా ఎదిగాడు. పదోతరగతిలో 85 శాతం, ఇంటర్లో 86 శాతం, డిగ్రీలో 84 శాతం మార్కులు సాధించి ప్రతిభ చాటాడు. ఇప్పుడు ముంబైలోని ప్రతిష్ఠాత్మక ఐసీఎఫ్ఏఐ బిజినెస్ స్కూల్లో ఎంబీఏలో సీటు సంపాదించాడు. కానీ ఆ కోర్సు పూర్తిచేయాలంటే రూ.11.31 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంతడబ్బు చెల్లించలేక దాతలకోసం ఎదురుచూస్తున్నాడు మొమ్మద్ అక్బర్. నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన అక్బర్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవటంతో అనాథ విద్యార్థి గృహంలోనే పెద్దవాడయ్యాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి ప్రతిభ చూపిన అతడిని దిల్సుఖ్నగర్లోని సిద్దార్ధ కళాశాల యజమా న్యం ఉచితంగా ఇంటర్మీడియట్లో చేర్చుకొంది. కాచిగూడలోని బద్రుకా కళాశాల కూడా ఉచితంగా బీకాం చదివే అవకాశం కల్పించింది. తాజాగా అతడు ఐసీఎఫ్ఏఐ బిజినెస్ స్కూల్ (ఐబీఎస్ క్యాంపస్)లో జాతీయస్థాయిలో జరిగిన ప్రవేశ పరీక్షలో 84 శాతం మార్కులతో ఉత్తీర్ణుడై ముంబై బ్రాంచ్లో ఎంబీఏ సీటు సాధించాడు. ఈ కోర్సు చదవడానికి 4 సెమిస్టర్లకు రూ.7.21 లక్షలు, రెండు సంవత్సరాల హాస్టల్ వసతి, ఇతర ఖర్చులకు రూ.3.30 లక్షలు, అడ్మిషన్ కోసం రూ.80 వేలు కలిపి మొత్తం రూ.11.31 లక్షలు కట్టాల్సి ఉంటుందని విద్యార్థి గృహం నిర్వాహకుడు మార్గం రాజేశ్ తెలిపారు. ఈ నెల 23వ తేదీలోగా రూ.80 వేలు చెల్లించి సీటు రిజర్వు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దాతలు స్పందించి అక్బర్ ఉన్నత చదువు కోసం సహాయం చేయాలని కోరుతున్నారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ :
9985720394
బ్యాంక్ అకౌంట్ వివరాలు
అకౌంట్ నంబర్ :
019210011907440
ఐఎఫ్ఎస్సీ కోడ్ : UBIN0801925
యూనియన్ బ్యాంకు,
కొత్తపేట బ్రాంచ్