గ్రేటర్ వాసులు ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్నును ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం రాయితీ వస్తుందని ప్రభుత్వం ప్రకటించడంతో ఇళ్లు, వ్యాపార సముదాయాల యాజమానులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ ఏర్లీబర్డ్ సద్వినియోగం ద్వారా వేలాది రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. ఐతే, సదరు యాజమానులు కిందట ఏడాదికి సంబంధించి ఎలాంటి పన్ను బకాయి ఉండరాదు. పాత బకాయి ఉంటే ముందస్తు పన్ను చెల్లింపులో రాయితీకి అవకాశం ఉండదు. ఒకవేళ ఐదు శాతం రాయితీ పొందాలంటే పాత బకాయి, దానిపై నమోదైన ఆపరాధ రుసుం మొత్తం చెల్లిస్తేనే అవకాశం కల్పిస్తున్నారు. కాగా, ఈ నెల 12 (సోమవారం) నాటికి 63713 మంది ఈ ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకోగా, వీరి ద్వారా రూ.32.29 కోట్ల మేర ఆదాయాన్ని జీహెచ్ఎంసీ సమకూర్చుకున్నది. కాగా, ఇళ్ల యాజమానులు, వ్యాపార సముదాయాల వారు ముందస్తు ఆస్తి పన్ను చెల్లించి ప్రభుత్వం కల్పిస్తున్న ఐదు శాతం రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచిస్తున్నారు. 2021-22 సంవత్సరానికి గానూ రూ.లక్షల్లో పన్ను బకాయిలు ఉన్న యాజమానులు ఏడాది కాలం పన్ను ఒకేసారి చెల్లిస్తే రాయితీ కూడా రూ.వేలల్లో వస్తుందని, ఈ నెల 31 వరకు రాయితీ సదుపాయం ఉందని చెబుతున్నారు.