న్యూఢిల్లీ: తాను ఆర్డరు చేసిన ఆక్సిజన్ కాంసంట్రేటర్స్ సరఫరా విషయమై చైనా తాత్సారం చేస్తున్నదని ప్రముఖ నటుడు, మానవతావాది సోనూ సూద్ చేసిన ఆరోపణపై భారత్ లోని చైనా రాయబారి స్పందించారు. కోవిడ్-19పై పోరాటంలో భారత్ కు చైనా శాయశక్తులా తోడ్పడుతుందని రాయబార్ సన్ వెయ్ డాంగ్ ట్విట్టర్ ద్వారా హామీ ఇచ్చారు. సోనూ సూద్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు గమనించానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విమానం ద్వారా సరుకుల రవాణా నిరాటంకంగానే సాగుతున్నదని, సరుకులు యథావిధిగానే రావచ్చని తెలిపారు. చైనాలోని కార్మికులు మేడే సెలవు కూడా లెక్కచేయకుండా ఇండియాకు అవసరమైన యంత్రాలు తయారు చేస్తున్నారని రాయబారి తెలిపారు. ఇంకా సమస్య పరిష్కారం కాకపోతే తనకు తెలియజేయాలని సూద్కు చైనా రాయబారి సూచించారు. ఈ స్పందనకు సోనూ సూద్ ధన్యవాదాలు తెలిపారు. మొదటి విడత కరోనా సంక్షోభంలో వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు అపూర్వమైన రీతిలో సాయం అందించి అందరి మన్ననలు అందుకున్న సోనూ సూద్ ప్రస్తుతం కోవిడ్ రెండో విడత కల్లోలంలో వైద్య సాయం విషయమై ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.