హైదరాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): భారత స్వాతంత్య్ర 75వ వసంతోత్సవాల సందర్భంగా నిర్వహించ తలపెట్టిన అమృతోత్సవ్ వేడుకలను రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి కారణంగా వాయిదావేస్తున్నట్టు ఉత్సవాల కమిటీ చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అమృతోత్సవాల్లో భాగంగా తెలంగాణలోనూ 75 వారాలపాటు వేడుకలు కొనసాగించాలని గతంలోనే సీఎం కేసీఆర్ ఆదేశించారు. గత మార్చి 24న ఫ్రీడం రన్, ఏప్రిల్ 3న కవి సమ్మేళనం, ఏప్రిల్ 9 నుంచి 15 వరకు స్వాతంత్య్ర పోరాటాన్ని వర్ణించే ఫొటో ఎగ్జిబిషన్ను విజయవంతంగా నిర్వహించారు.