హైదరాబాద్ : ప్రజల్లో దేశభక్తినిపెంపొందించడానికి ఆకాశవాణి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి , తెలంగాణ రాష్ట్ర గౌరవ సలహాదారు కె.వి.రమణాచారి అన్నారు. 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన అమృత భారతి కార్యక్రమంలో ఆయన
ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర అమృత ఉత్సవాల సందర్భంగా ఆకాశవాణి ఏడాది పాటు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా ఆకాశవాణి సంగీత భాండాగారం నుంచీ ఎంపిక చేసి, రూపొందించిన 75 సుప్రసిద్ధ దేశభక్తి గీతాల సీడీని రమణాచారి ఆవిష్కరించారు.
1960 ల నుంచి ఆకాశవాణి ప్రసారం చేసిన దేశభక్తి గీతాలు వీటిలో ఉన్నాయి. ఈ సందర్భంగా అలనాటి సుప్రసిద్ధ గాయని టంగుటూరి సూర్యకుమారి ఆలపించిన మాదీ స్వతంత్ర దేశం దేశభక్తి గీతాన్ని సభలో వినిపించడం జరిగింది. ఆకాశవాణి నిలయ విద్వాంసులు, సుప్రసిద్ధ గాయకులు డి.వీ.మోహన కృష్ణ ఆలపించిన దేశభక్తి గీతంతో సభ ప్రారంభమైయింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమ విభాగం అధిపతి వి.ఉదయశంకర్ మాట్లాడుతూ.. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆకాశవాణి ప్రత్యేకంగా రూపొందించి ప్రసారం చేస్తున్న దేశభక్తి కార్యక్రమాలను గురించి వివరించారు. స్వాతంత్య్ర అమృత ఉత్సవాల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేయడానికి ఆకాశవాణి తనవంతు పాత్ర పోషిస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వీ.ఎస్. ఆర్ మూర్తి, వింగ్ కమాండర్ ఎం.వి. ఎల్. నారాయణ అమృత భారతి సభలో ప్రసంగించారు. స్వాతంత్య్ర స్పూర్తిని చాటడానికి ఆకాశవాణి ఎంతో కృషిచేస్తోందని వారు ప్రశంసించారు. ఆకాశవాణిలో మూడు దశాబ్దాలు పనిచేసి ఉద్యోగ విరమణ చేస్తున్న విఖ్యాత వ్యాఖ్యాత అంబడిపూడి మురళి కృష్ణ -యశోద కృష్ణ దంపతులను రమణాచారి ఆధ్వర్యంలో సన్మానించారు. ఆకాశవాణి వ్యాఖ్యాత బాలకృష్ణ సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సహాయ సంచాలకులు సి.ఎస్. రాంబాబు, కార్యక్రమ నిర్వాహకులు విజయ రాఘవరెడ్డి, నక్కా సుధాకర్, పాల్ రాజ్ శేఖర్, గోపీచంద్, సందీప్, కార్యవర్థి ప్రభృతులు పాల్గొన్నారు.