సుల్తాన్బజార్, మే 9: కరోనా రోగులకు పూర్తిస్థాయిలో సేవలందిస్తున్న గాంధీ, కింగ్కోఠి, టిమ్స్ దవాఖానలతో పాటు నగరంలో మరిన్ని చోట్ల ఈ సేవలను విస్తృతం చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికకు తగినట్టుగా సుల్తాన్బజార్ ప్రసూతి వైద్యశాల కూడా సిద్ధమైంది. ఇక్కడ కూడా అన్ని వసతులతో కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. గర్భవతుల వైద్యానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా కొవిడ్ సేవల కోసం అదనపు వసతులు ప్రారంభించనున్నారు. దవాఖానలోని నూతన భవనంలో కొవిడ్ రోగులకు కావాల్సిన అన్ని వసతులను కల్పించే పనులను ప్రారంభించారు. భవనంలోని జీ ప్లస్, మొదటి, రెండు, మూడో అంతస్తులలో పడకలు, ఆక్సిజన్ సరఫరాకు అవసరమయ్యే సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ప్రావీణ్య ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
150 పడకలతో ఏర్పాటు చేయనున్న ఈ వసతి కోసం జీహెచ్ఎంసీ, దవాఖాన పాలకవర్గం సమన్వయంతో పని చేస్తున్నాయి. అయితే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో 40 పడకలతో ఐసీయూను, 20 ఆక్సిజన్, 20 సీ ప్యాక్ వెంటిలేటర్ల పడకలను, మొదటి అంతస్తులో 40 పడకలు, రెండో అంతస్తులో 10, మూడో అంతస్తులో 40 పడకలను అందుబాటులోకి తెస్తున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కె.రాజ్యలక్ష్మి తెలిపారు. అయితే భవనంలో ఆక్సిజన్ పైప్లైన్ పనులు పూర్తి అయినా ప్లాంట్ లేకపోవడంతో ప్రస్తుతం సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ అందించాలని యోచిస్తున్నామని ఆమె అన్నారు.