అసెంబ్లీలో మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద ఇప్పటి వరకు 3,676 మంది విద్యార్థులకు రూ.589.69 కోట్ల ఆర్థికసాయం అందించినట్టు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, వివేకానంద్గౌడ్, షకీల్ అమీర్ మహ్మద్, హరిప్రియ బానోతు, జాఫర్ హుస్సేన్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. అర్హుల వార్షికాదాయ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే విషయంపై సీఎం కేసీఆర్తో చర్చిస్తామని పేర్కొన్నారు. 17,425 మంది నిరుద్యోగ మైనార్టీ యువతకు రూ.145.26 కోట్ల సబ్సిడీతో వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చినట్టు వివరించారు. డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం ద్వారా 409 మందికి రూ.18.17 కోట్ల సబ్సిడీతో కార్లు అందించామని చెప్పారు. మరో 420 మందికి త్వరలోనే కార్లు అందిస్తామన్నారు.
3 నెలలు రేషన్ తీసుకోకుంటే కార్డు రద్దు
కొత్త కార్డుల జారీ నిలిపివేయలేదు: గంగుల
పేదలకు రేషన్కార్డుల జారీ నిరంతరం కొనసాగుతుందని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొత్త కార్డుల జారీని నిలిపేయలేదని శనివారం శాసనసభలో పలువురు సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. లబ్ధిదారులు వరుసగా మూణ్ణెళ్లు రేషన్ బియ్యం తీసుకోకుంటే కార్డు రద్దవుతుందని స్పష్టంచేశారు.
విద్యుత్తు రంగంలో అద్భుత విజయాలు:మంత్రి జీ జగదీశ్రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు రంగంలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించిందని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. మండలిలో శనివారం ప్రశ్నోత్తరాల్లో ఎంఐఎం సభ్యుడు సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. కొవిడ్ సమయంలో విద్యుత్శాఖపై రూ.4000 కోట్ల భారం పడిందని తెలిపారు. బిల్లుల్లో అవకతవకలు జరిగాయన్న విషయంలో నిజం లేదని చెప్పారు. ప్రస్తుతానికి టారిఫ్ను సవరించే ఆలోచన ప్రభుత్వానికిలేదని స్పష్టంచేశారు.
సేంద్రియ సాగును ప్రోత్సహిస్తాంమండలిలో మంత్రి నిరంజన్రెడ్డి
రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి చెప్పారు. మండలిలో టీఆర్ఎస్ సభ్యుడు శేరి సుభాష్రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. కేంద్రం ఎరువులకు ఇస్తున్న సబ్సిడీని తగ్గించుకొనేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నట్టు ప్రకటించిందని, రాష్ట్రంలో కూడా సేంద్రియ సాగును ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. సేంద్రియ వ్యవసాయంపై శాస్త్రీయంగా అవగాహన పెంచుకోవడానికి ఆర్గానిక్ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిపారు.
సబ్బండవర్ణాల సంక్షేమ బడ్జెట్ మండలిలో బడ్జెట్పై చర్చలో సభ్యులు
ప్రభుత్వం ప్రవేశపెట్టింది సబ్బండవర్ణాల బడ్జెట్ అని శాసనమండలి సభ్యులు పేర్కొన్నారు. శాసనమండలిలో శనివారం బడ్జెట్పై చర్చ ప్రారంభమైంది. చర్చను చీఫ్విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. బీజేపీ సభ్యుడు రాంచందర్రావు, టీఆర్ఎస్ సభ్యులు ఎంఎస్ ప్రభాకర్రావు, దయానంద్గుప్తా, ఎంఐఎం సభ్యుడు జాఫ్రీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి బడ్జెట్పై ప్రసంగించారు. సబండవర్గాల ప్రగతి బడ్జెట్గా పేర్కొన్నారు. బడ్జెట్లో పూజారులకు, దేవాలయాల్లో తొలిసారిగా ధీప, దూప, నైవేద్యానికి నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తంచేశారు.