ముంబై: కరోనా రెండో వేవ్ అందరిని వణికిస్తున్నది. తొలి దశతో పోలిస్తే తాజా కేసుల్లో మరణాలు ఎక్కువవుతున్నాయి. ఆక్సిజన్ కొరత.. దవాఖానాల్లో బెడ్ల కొరత.. రెమ్డెసివిర్ వంటి కీలక ఔషధాల బ్లాక్ మార్కెటింగ్ వంటి అంశాలు కొవిడ్-19 బారిన పడ్డ వారి ప్రాణాలు బలి గొంటున్నాయి. పరిస్థితి విషమించిన రోగుల చికిత్స కోసం ఆయా కుటుంబాలు రూ. లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తున్నది.
దీనికి తోడు గతేడాది కరోనా మహమ్మారి ప్రభావం మొదలైనప్పటి నుంచి పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ విధించినప్పుడు తగ్గిన పెట్రోల్ వినియోగం ఇప్పుడిప్పుడే సాధారణ స్థాయికి చేరుకుంటున్నది.
గతేడాది పెట్రోలియం వినియోగంతోపాటు ఉత్పత్తిని తగ్గించడంతో అంతర్జాతీయంగా ధరలు పడిపోయాయి. దేశీయంగా ధర తగ్గకుండా కేంద్రం రెండు దఫాలు ఎక్సైజ్ సుంకాలు పెంచడంతో ప్రస్తుతం పెట్రోల్ లీటర్ ధర పలు నగరాల్లో సెంచరీ మార్క్ను దాటేసింది.
కరోనా నుంచి చికిత్స, పెట్రోల్ వినియోగం కోసం భారతీయ కుటుంబాలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి. ప్రైవేట్ తుది వినియోగ ఖర్చు 5 నుంచి 11 శాతానికి దూసుకెళ్లిందని ఎస్బీఐ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
భారత్లో హెల్త్కేర్ వ్యయం రూ.6 లక్షల కోట్ల నుంచి కనీసం రూ.6.7 లక్షల కోట్లకు చేరుతుందని ఎస్బీఐ చీఫ్ ఎకనమిస్ట్ సౌమ్యకాంతి ఘోష్ చెప్పారు. దీని ప్రకారం రూ.70 వేల కోట్ల ఖర్చు పెరుగనున్నది. తదనుగుణంగా ఇతర ఖర్చులను భారతీయ కుటుంబాలు గణనీయంగా తగ్గించివేసుకుంటున్నాయి.
మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు హెల్త్కేర్ ఖర్చులతోపాటు ద్రవ్యోల్బణ భారం పడటంతో కుటుంబాల విచక్షణాయుతమైన ఖర్చులపై రెండు విధాల దెబ్బ పడుతున్నది. ఇతర ఖర్చులు ఆచితూచి పెడుతున్నారని ఎస్బీఐ సర్వే సారాంశం.
అధిక ఇంధన ధరలు, పెరిగిన నిత్యవసరాల ధరలు, ఆరోగ్య ఖర్చులు కుటుంబాలపై ప్రభావం చూపుతునే ఉన్నది. ఇటీవల పెరిగిపోయిన ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తున్నది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ద్రవ్యోల్బణ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయా? అన్న అంశాన్ని తెలుసుకోవాల్సి ఉందని సౌమ్యకాంతి ఘోష్ చెప్పారు.
భారత గ్రామీణ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 6.4 శాతం పలికిందని గుర్తు చేశారు. దీని వల్ల గ్రోత్ రేట్ నెమ్మదిస్తుంది. అధిక ద్రవ్యోల్బణం భారత ఆర్థిక వ్యవస్థకు సవాల్గా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ గేమ్ చేంజర్ గా మారుతుందని సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి కీలక సంకేతం కానుందన్నారు. మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉంటాయని, చివరి త్రైమాసికం ఆర్థిక ఫలితాలు పరిపుష్టిని కలిగిస్తాయన్నారు.
తరుణ్ తేజ్పాల్పై లైంగిక వేధింపుల కేసు.. విచారణ మే 21కి వాయిదా..!
ఐటీ కొలువుల మేళా : క్రెడిట్ సూస్ లో 1000కి పైగా టెకీల నియామకం!
క్రిప్టోకరెన్సీకి ట్విట్టర్ సీఈఓ వెన్నుదన్ను
తౌటే తుఫాన్: తౌటే అంటే అర్థం తెలుసా..?