హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పెండింగ్లో పడిన అన్ని పరీక్షలను జూలై 8 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ ఒక ప్రకటన చేసింది. వాస్తవానాకి ఓయూ పరిధిలోని అన్ని కాలేజీల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ కోర్సులకు సంబంధించిన మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈ ఏడాది మార్చి/ఏప్రిల్ నెలల్లో జరుగాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆ పరీక్షల నిర్వహణ సాధ్యపడలేదు. దాంతో పెండింగ్ పరీక్షలు అన్నింటినీ ఈ నెల 8 నుంచి నిర్వహించాలని ఓయూ నిర్ణయించింది.
పరీక్షలకు సంబంధించి గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్లో ఎలాంటి మార్పులు చేయలేదని, గత మార్చిలో విద్యార్థులకు జారీచేసిన హాల్టికెట్లలో ఏవైతే పరీక్షా కేంద్రాలు ఉన్నాయో ఆయా కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతాయని ఓయూ అధికారులు తెలిపారు. అయితే పరీక్షల సమయాన్ని మూడు గంటలకు బదులుగా రెండు గంటలకు కుదించినట్లు వెల్లడించారు. ఆ మేరకు ప్రశ్నల సంఖ్య, మార్కులలో కూడా మార్పులు చేసినట్లు ప్రకటించారు.
డిగ్రీ మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలు రోజు మార్చి రోజు కాకుండా అన్ని రోజుల్లో జరుగుతాయని, కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షల నిర్వహణ రోజుల సంఖ్యను తగ్గించడం కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఓయూ అధికారులు వివరించారు. అంతేగాక ఐదో సెమిస్టర్ పూర్తయిన విద్యార్థులకు విద్యాసంవత్సరం వృథా కాకుండా ఆరో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం వీలవుతుందని తెలిపారు. ఈ విద్యార్థులు ఇందుకు సహకరించాలని కోరారు.