హుజూరాబాద్టౌన్, జూలై 10: ‘పదవులు వచ్చినా.. రాకపోయినా ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే ఉన్నాం.. ఇప్పుడూ.. ఎప్పటికీ ఆయన వెంటే ఉంటాం.. సీఎం కేసీఆరే మా నాయకుడు అని’ తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్(టీజీఏ) రాష్ట్ర అధ్యక్షుడు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ మర్రి యాదవరెడ్డి స్పష్టం చేశారు. శనివారం హుజూరాబాద్లోని కాకతీయ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన నియోజకవర్గస్థాయి టీజీఏ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. అంతకు ముందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయాచోట్ల మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ నేతృత్వంలో 2001లో కాకతీయ, ఉస్మానియా ప్రొఫెసర్లు స్థాపించిన తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నేతృత్వంలో టీజీఏ ఏర్పడిందని, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అండగా ఉండి తెలంగాణ ఉద్యమంలో తన దైన పాత్ర పోషించిందని చెప్పారు. ఈటల రాజేందర్కు సీఎం కేసీఆర్ ఏం తక్కువ చేశారో చెప్పాలని, ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్గా, పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర నాయకుడిగా గుర్తించి అక్కున చేర్చుకుంటే ఆయనకే వెన్నుపోటు పొడవాలని చూడడం అత్యంత దారుణమని మండిపడ్డారు. పదవిలో ఉండి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పార్టీని ఇరుకున పెట్టాలని, కేసీఆర్ను బదనాం చేయాలని చూడడం, తప్పులు చేయడం వల్లే ఆయనను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈటల స్వార్థ, వ్యక్తిగత కుటుంబ ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరాడని దుయ్యబట్టారు. రాజీనామా చేసి బీజేపీలో చేరక ముందు కొంత సానుభూతి, అభిమానం ఉండేదని, ఇప్పుడు అన్నీ చెరిగిపోయాయన్నారు. తెలంగాణ ప్రజలకు ఏం చేయాలనే సంపూర్ణ అవగాహన సీఎం కేసీఆర్ ఒక్కరికే ఉందని చెప్పారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈటల దగ్గరుండి చూసి నేడు తప్పు పట్టే స్థితికి రావడం ఆయనకే చెల్లుతుందని ధ్వజమెత్తారు. 2001లో పార్టీలోకి వచ్చినప్పుడు తామెలా ఉన్నామో ఇప్పటికీ అలాగే ఉన్నామని, తమ ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని, కానీ ఈటలకు వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి మరిచి వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడని, తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్లు ఆయన వైఖరి మారిందని మండిపడ్డారు. బీజేపీలో ఇలాంటి వ్యక్తులను ఎలా చేర్చుకుంటున్నారో ఆ పార్టీకే తెలియాలని, ఈ విషయంలో మేధావులు, విద్యావంతులు ఆలోచించాలన్నారు. అధికార పార్టీలో ఉండి హుజూరాబాద్లో అభివృద్ధి చేయలేని ఆయన, మళ్లీ గెలిచి ప్రతిపక్ష నాయకుడిగా ఏ విధంగా అభివృద్ధి చేస్తాడో చెప్పాలని ఈటలను ప్రజలు ప్రశ్నించాలని కోరారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ అతని సెగ్మెంట్లో ఏం పనులు చేశాడో..?, ఎన్ని కోట్ల నిధులు తెచ్చారో..? ఇప్పటికీ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా ఈ ప్రాంత అభివృద్ధి కోసం గెలిపించాలని, ఈ విషయంలో టీజీఏ ప్రజలకు అవగాహన కల్పించి టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తుందని చెప్పారు. ఇక్కడ తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతె చిరంజీవి, నియోజకవర్గంలోని ఐదు మండలాధ్యక్షులు లింగబర్తిని మల్లేశ్, అంజుబాబు, రఘుపతి, బొనగాని రాజయ్య, కుసుంబ శివాజీ, హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు కే అనిల్, ప్రధాన కార్యదర్శి భరత రజినీకాంత్, మండల ప్రధాన కార్యదర్శి వంగ రజినీకాంత్, నాయకులు శ్రీకాంత్శర్మ, కే అనిల్, తిప్పారపు భిక్షపతి, రాజేశ్వర్రెడ్డి ఉన్నారు.
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యం..
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా టీజీఏ పనిచేస్తుంది. నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే ఎందుకు అభివృద్ధి చేయలేదో.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క నెలలోనే ఏ విధంగా హుజూరాబాద్ను అభివృద్ధి చేస్తుందో ప్రజలకు అవగాహన కల్పిస్తాం. ఈటల 14 ఏండ్లు ఎమ్మెల్యేగా, ఏడేళ్లు మంత్రిగా ఉండి తన ఆస్తులు మాత్రమే పెంచుకున్నాడు తప్ప ఆయనను నమ్ముకున్న ప్రజలకు ఏం చేయలేదు. పైగా తనకు అవకాశాలు ఇచ్చి పెంచి పెద్ద చేసిన పార్టీకే వెన్నుపోటు పొడవాలని చూసిండు. త్వరలో జరుగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా గెలిపించాలని గ్రామ గ్రామాన తిరిగి కోరుతాం.
ఈటల అసమర్థుడు..
14 ఏండ్లు ఎమ్మెల్యేగా.. ఏడేళ్లు మంత్రి గా పని చేసిన ఈటల అనుకున్న స్థాయిలో హుజూరాబాద్ను, కనీసం ఆయన సొంత గ్రామం ఉన్న కమలాపూర్ మండలాన్ని ఏమాత్రం అభివృద్ధి చేసుకోలేని అసమర్థుడు. అధికార పార్టీలో ఉన్నప్పుడే అభివృద్ధి చేయనోడు.. ఇప్పుడు గెలిచి ఏం చేస్తాడు..? నిధులు కావాలని మంత్రులు వద్దకు వెళ్లి ఎలా అడుగుతాడు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్కుమార్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులేం చేశాడు.. ఎన్ని నిధులు తెచ్చాడనే విషయాన్నీ ప్రజలకు చెబుతాం. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న, చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను వివరిస్తాం. టీఆర్ఎస్కు పట్టభద్రులు, విద్యావంతులు ఓటు వేసేలా కృషి చేస్తాం.