2,3,4 అంతస్తుల్లో కొవిడ్ చికిత్స
మిగిలిన అన్ని అంతస్తుల్లోసాధారణ సేవలు
గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు
బన్సీలాల్పేట్, జూలై 27: ప్రస్తుతం కొవిడ్ నోడల్ కేంద్రంగాఉన్న సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో వచ్చేనెల 3 నుంచి అన్నిరకాల వైద్యసేవలు ప్రారంభిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు తెలిపారు. కొవిడ్తోపాటు అత్యవసర సేవలు, ఓపీ, ఐపీ సేవలను అందుబాటులో తీసుకురావాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ప్రస్తుతం 372 మంది కొవిడ్ బాధితులు ఉన్నారని, అందులో 156 మంది బ్లాక్ఫంగస్ రోగులు అని తెలిపారు. మంగళవారం 30 మంది డిశ్చార్జి అయ్యారని చెప్పారు. దవాఖానలోని ప్రధానభవనంలో రెండు, మూడు అంతస్తులను కొవిడ్ సేవలకు, నాలుగో అంతస్తును బ్లాక్ఫంగస్ రోగుల సేవలకు కేటాయించామని చెప్పారు. 250 ఐసీయూ బెడ్లను కొవిడ్ రోగులకే వినియోగిస్తామని తెలిపారు. మిగతా అంతస్తుల్లో ఉన్న వార్డులను, ఐసీయూ వార్డులను సాధారణ రోగుల సేవలకు వినియోగిస్తామని వివరించారు. అత్యవసర సేవల విభాగం భవనంలో అన్నిరకాల రోగులను చేర్చుకుంటామని పేర్కొన్నారు. రెండోదశ కరోనా కేసులు పెరగడంతో ఈ ఏడాది మార్చి 21 నుంచి గాంధీ దవాఖానను కొవిడ్ నోడల్ కేంద్రంగా మార్చామని తెలిపారు. వైద్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాధారణ వైద్య సేవలు ప్రారంభించాలని నిర్ణయించాయని, అందుకోసం ఒకటి, ఐదు, ఆరు, ఏడు అంతస్తుల్లోని అన్నివార్డులను శుభ్రం చేయిస్తున్నామని చెప్పారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రతలు తీసుకుంటున్నామని తెలిపారు. వైద్యులు, నర్సులు, సిబ్బంది సమిష్టి కృషితోనే కరోనాను సమర్థంగా ఎదుర్కోగలిగామని చెప్పారు. ఒకవేళ మూడోదశ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.