హైదరాబాద్ : యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ సాధించిందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ముగిసినట్లు వెల్లడించిన ఆయన 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసినట్లు చెప్పారు. 23 జిల్లాల్లో అంచనాలకు మించి వందశాతం పైగా కొనుగోళ్లు జరిగాయన్నారు. ఇది గత ఏడాది కంటే 28 లక్షల టన్నులు అధికమన్నారు. 15 లక్షల మంది రైతుల నుంచి రూ.17 వేల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. ఏడేళ్లల్లో ఒక్క యాసంగిలోనే 594 శాతం పెరుగుదల నమోదైందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి కనీస మద్దతు ధరకు రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు. మంగళవారం నగరంలోని పౌరసరఫరాల భవన్లో మారెడ్డి శ్రీనివాస్రెడ్డి విలేకరుల సమావేశం ద్వారా వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో రూ. 84 వేల కోట్లు విలువ చేసే 4 కోట్ల 84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, అప్పటి నుంచి 2019-20 వరకు ధాన్యం కొనుగోలు చేసిన ఐకేపీ. పీఏసీఎస్, డీసీఎస్టీతో జీ.సీ.సీ, హాకా వంటి ఇతర ఏజెన్సీలకు రూ.1,029 కోట్ల కమీషన్ను చెల్లించినట్లు తెలిపారు.
ఇదివరకు యాసంగిలో కంటే వానాకాలంలో ఎక్కువ పంటలు పండేవి. ఇప్పుడు దీనికి భిన్నమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. వానాకాలంలో పండిన పంట కంటే కూడా యాసంగిలో అధిక పంటలు పండుతున్నాయన్నారు. దీనికి ఈ ఏడాది యాసంగిలో ధాన్యం దిగుబడి, కొనుగోళ్లే నిదర్శనమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి ఏడాది 2014 – 15 యాసంగిలో 13.24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, నేడు 2021 యాసంగిలో 92 లక్షల మెట్రిక్ టన్నులకు చేరడం.. అంటే 594 శాతం కొనుగోళ్లు పెరిగాయన్నారు. ఇది యావత్తు తెలంగాణ రైతాంగం విజయంగా అభివర్ణించారు.
ఏప్రిల్ మొదటివారంలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల కొరకు 6, 968 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపిన మారెడ్డి దాదాపు రెండున్నర నెలలపాటు కొనుగోళ్ల ప్రక్రియను నిర్విరామంగా సాగించి రికార్డు స్థాయిలో 15 లక్షల మంది రైతుల నుంచి రూ.17,300 కోట్ల విలువ చేసే 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లు ముగియడంతో రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలను మూసివేసినట్లు చెప్పారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా అదనంగా 12 లక్షలు (13 శాతం) అధికంగా కొనుగోలు చేశామని తెలిపారు. ఇందుకు అదనంగా మరో రూ. 2 వేల కోట్ల వ్యయం అయిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం, మార్గదర్శకాల మేరకు పెరిగిన దిగుబడులకు అనుగుణంగా పౌరసరఫరాల సంస్థ చేపట్టిన చర్యలు రైతాంగంలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందన్నారు. అంతేకాకుండా దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యంకాని విధంగా తెలంగాణ పౌరసరఫరాల సంస్థ వందశాతం ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తూ దేశానికే కొత్త మార్గాన్ని చూపిస్తోందని మారెడ్డి పేర్కొన్నారు.
నల్లగొండ-7,83,574.. నిజామాబాద్-7,55,819.. సూర్యా పేట-6,49,192.. జగిత్యాల-5, 52,794.. సిద్దిపేట-5,40,049.. కామారెడ్డి-4,51,154.. మెదక్-4,41,130.. కరీంనగర్-4,14,859.. యాదాద్రి-4,06859.. పెద్దపల్లి-3,89,601.
తెలంగాణ రాష్ట్రాన్ని రైతు రాజ్యంగా మార్చాలి. రైతును రాజును చేయాలన్నది సీఎం కేసీఆర్ అంతిమ లక్ష్యం. ఈ లక్ష్యం చేరుకోవడానికి ఇప్పటికే ఎన్నెన్నో రైతు సంక్షేమ చర్యలను చేపట్టి అమలు చేస్తున్నారు. సీఎం తీసుకున్న రైతు సంక్షేమ చర్యల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ ముఖచిత్రమే మారిపోయిందన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, ఎరువుల పంపిణీ, రైతువేదికలు, మిషన్ కాకతీయ లాంటి పథకాలు అధిక దిగుబడులు రావడానికి తోడ్పడ్డాయన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు, మార్గదర్శకత్వంలో రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరకు పౌరసరఫరాల సంస్థ ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా పూర్తిచేసినట్లు ఆయన పేర్కొన్నారు.