హైదరాబాద్ : రాష్ట్రంలో బడి గంట మోగింది. పిల్లల మనసులు మురిశాయి. ఉప్పొంగే ఉత్సాహంతో చెంగుచెంగున బడిబాట పట్టారు. నేటి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కావడంతో పాఠశాలల్లో సందడి నెలకొంది. ఇన్నాళ్లు పంజరంలో బంధించిన చిలుకల వలే ఇబ్బందలు పడ్డ విద్యార్థులు ఇప్పుడు నీటిలోని చేపల వలే, నింగిలోని పక్షుల్లా ఎగురుతూ సంబురంగా పాఠశాలలకు పయనమయ్యారు. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో..ఏడాదిన్నర తర్వాత విద్యార్థులు స్కూళ్లకు వెళ్తున్నారు.
17 నెలల సుధీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థుల ముఖాల్లో ఆనందం వెలిగిపోయింది. కరోనా రక్కసికి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇక నిరుపేదల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. రొక్కాడితే కాని డొక్కాడని బడుగు జీవుల పిల్లలు అర్ధాకలితో అలమటించారు. అటు స్కూల్లో మధ్యాహ్న భోజనం లేక.. ఇటు తల్లిదండ్రులకు ఉపాధి దొరుకక, ఆకలితో వేలాది మంది పిల్లలు బుక్కెడు బువ్వకోసం ఎన్నో పాట్లుపడ్డారు. నేడు ప్రభుత్వం స్కూళ్లు తెరవడంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా పక్కాగా అందించాలని సర్కారు ఆదేశించడంతో వేలాది మంది పిల్లలకు ఓ గొప్ప భరోసా కలిగినట్లయింది.
ఇన్నాళ్లు ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా అది కొద్దిమంది పిల్లలకే ప్రయోజనకరంగా మారింది. మెజార్టీ విద్యార్థులకు సెల్ఫోన్లు, కంప్యూటర్లు అందుబాటులో లేవు. ఉన్న కొద్దిమందిలో కూడా నెట్వర్క్ ప్రాబ్లం, రీచార్జి చేసుకోవడం తదితర సమస్యలు ఉత్పన్నం కావడంతో చదువుకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ బడులు తెరుచుకోవడంతో చదువుల్లో నిమగ్నమయ్యారు.
విద్యార్థులే కాదు ఇటు విద్యారంగ అనుబంధ సంస్థలకు కూడా ఉపాధి లభించే అవకాశం ఉంది.
బడుల మూసివేతతో పిల్లలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరించారు. నిపుణల సూచనలు, విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేజీ టు పీజీ వరకు విద్యా సంస్థలు తెరువడంతో పాటు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ఆదేశించారు.
ఆ మేరకు కొవిడ్ నివారణ ఏర్పాట్లు కూడా పక్కాగా అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో తల్లిదండ్రుల్లో ప్రభుత్వ నిర్ణయం పట్ల నమ్మకం కలిగింది. తమ పిల్లలను నిర్భయంగా పాఠశాలలకు పంపిస్తున్నారు. అందుకు మొదటి రోజు విద్యార్థుల హాజరే నిదర్శనం.
సైకిల్పై బిడ్డను స్కూల్కు తీసుకెళ్తున్న ఓ తండ్రి..తాతతో కలిసి గెంతులేస్తూ బడికి వెళ్తున్న మరో బాలిక, అమ్మతో కలిసి ఆడుతూ పాడుతూ వెళ్తున్న అన్నదమ్ములు..ఆటోలో పాటలు పాడుకుంటూ స్కూల్కు వెళ్తున్న విద్యార్థుల సన్నివేశాలు చూడ ముచ్చటగా ఉన్నాయి. ఇన్నాళ్లు పిల్లలు లేక బోసిబోయిన పాఠశాలలు నేడు విద్యార్థుల చేరికతో కళకళాడాయి.