‘స్వగ్రామం నుంచి హైదరాబాద్కు ప్రయాణమైన రమేశ్కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్లో సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగానే రమేశ్ ఆధార్ నంబర్ ఆధారంగా హెల్త్ ప్రొఫైల్ చెక్ చేసి సరైన చికిత్స అందించి ప్రాణం కాపాడారు. హఠాత్తుగా స్ఫృహ తప్పి పడిపోయిన రాధికను కుటుంబసభ్యులు దవాఖానకు తీసుకువెళ్లారు. ఆధార్ నంబర్ ఆధారంగా ఆమె ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని వైద్యులు సరైన చికిత్స మొదలు పెట్టారు’. రమేశ్, రాధిక మాత్రమే కాదు.. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతిఒక్కరికి ఇలాగే అవసరమైన అత్యవసర వైద్యం అందనున్నది. ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ తయారుచేసి సకాలంలో నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతు న్నది. రాష్ట్రంలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ను తయారుచేసేందుకు చర్యలు చేపట్టింది. ములుగు, రాజన్నసిరిసిల్ల జిల్లా ల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. వచ్చేనెలలో ప్రారంభించి మూడు నెలల్లోనే పూర్తి చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. దీనికి రాష్ట్ర ఐటీశాఖ సాంకేతిక సహకారం అందించనున్నది. పైలట్ ప్రాజెక్టు పూర్తికాగానే రాష్ట్రమంతా విస్తరించనున్నారు.
ఇంటింటికి వెళ్లి పరీక్షలు
హెల్త్ ప్రొఫైల్ కోసం వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు, ఉద్యోగులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేస్తారు. వీరు ఇంటింటికి వెళ్లి కుటుంబంలోని అందరి బ్లడ్ గ్రూప్, బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, కాటరాక్ట్, పల్స్రేట్, శరీర ఉష్ణోగ్రత వంటి పది రకాల పరీక్షలు నిర్వహిస్తారు. గతంలోని ఆరోగ్య సమస్యలు, చేయించుకొన్న వైద్యం వివరాలు సేకరించి ఒక డాటా తయారుచేస్తారు. చికిత్స అవసరమైనవారిని వెంటనే సమీపంలోని పీహెచ్సీకి తరలిస్తారు. పీహెచ్సీలో ప్లేట్లెట్ కౌంట్, కొలెస్ట్రాల్, కిడ్నీ, లివర్, హార్ట్ టెస్ట్ వంటి పది పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైతే పెద్ద దవాఖానలకు పంపుతారు. ఆరోగ్యవివరాలు, రోగనిర్ధారణ పరీక్షల నివేదికలను ఆ వ్యక్తి ఆధార్తో అనుసంధానిస్తారు. ఈ డాటాను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానలతో అనుసంధానం చేసి ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ డాటా దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఆధార్ నంబర్తోపాటు రోగి ఫోన్ నంబర్కు వన్టైం పాస్వర్డ్ (ఓటీపీ) వచ్చేలా ఏర్పాటు చేస్తారు. ఆ ఓటీపీ చెప్తేనే హెల్త్ ప్రొఫైల్ ఓపెన్ అయ్యేలా సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నట్టు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కేటీఆర్ చెప్పిన ఎస్తోనియా మోడల్
హెల్త్ ప్రొఫైల్ ఆధారిత చికిత్సలతో యూరప్లోని ఎస్తోనియా అనే చిన్నదేశం అద్భుత ఫలితాలు సాధిస్తున్నది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆ దేశం ఈ-హెల్త్, ఈ-అంబులెన్స్, ఈ-ప్రిస్క్రిప్షన్ను అమలు చేస్తున్నది. దేశంలోని 99 శాతం మంది ప్రజలకు డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ఉన్నాయి. ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఎస్టోనియా గురించి ప్రస్తావించారు. ఆ దేశ నమూనాను అధ్యయనం చేయాలని సూచించగా అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు.